తీరు మారడం లేదు ! | - | Sakshi
Sakshi News home page

తీరు మారడం లేదు !

Jun 22 2025 3:36 AM | Updated on Jun 22 2025 3:36 AM

తీరు మారడం లేదు !

తీరు మారడం లేదు !

● ఏసీబీకి చిక్కుతున్న ప్రభుత్వ ఉద్యోగులు ● లంచం తీసుకుంటూ పట్టుబడిన టైపిస్ట్‌ ● బూర్గంపాడు తహసీల్దార్‌ కార్యాలయంలో ఘటన

బూర్గంపాడు: జిల్లాలోని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ తరచూ ఏసీబీకి పట్టుబడుతున్నారు. ఓ ఘటన మరువక ముందే మరో ఘటన అన్నట్టుగా దొరికిపోతున్నారు. పట్టుబడిన వారిపై వేటు వేస్తున్నా.. మిగితా ఉద్యోగుల వైఖరిలో మార్పు రావడం లేదు. ఇటీవల భద్రాచలం, మణుగూరులో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు సీఐలు, సిబ్బంది లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నాలుగు నెలల క్రితం ఆళ్లపల్లి మండల పంచాయతీ అధికారి కూడా ఏసీబీకి చిక్కాడు. జిల్లాలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా.. లంచాలకు అలవాటుపడిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఇవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని అవినీతి నిరోధక శాఖ విస్తృతంగా ప్రచారం చేస్తుండడంతో ప్రజల్లో చైతన్యం పెరిగింది. లంచం అడిగిన వారి సమాచారాన్ని నేరుగా ఏసీబీకి చేరవేస్తుండగా ఆ శాఖ అధికారులు పధకం ప్రకారం దాడులు చేస్తూ అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులను అరెస్ట్‌ చేస్తున్నారు.

రూ.4వేలు తీసుకుంటూ..

బూర్గంపాడు తహసీల్దార్‌ కార్యాలయంలో టైపిస్ట్‌గా పనిచేసే నవక్రాంత్‌ కొత్త రేషన్‌ కార్డు జారీ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు సదరు వ్యక్తి శనివారం నవక్రాంత్‌కు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్‌ దాడిచేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నవక్రాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. అతడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులెవరైనా లంచం డిమాండ్‌ చేస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు.

ఆరేళ్లలో మూడోసారి..

బూర్గంపాడు తహసీల్దార్‌ కార్యాలయంలో గత ఆరేళ్లలో ఇప్పటికి మూడుసార్లు ఏసీబీ దాడులు జరిగాయి. పట్టాదారు పాసు పుస్తకాల కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌(డిప్యూటీ తహసీల్దార్‌), టైపిస్ట్‌ గతంలో ఏసీబీకి దొరికిపోయారు. ఆ ఘటన జరిగిన ఏడాదిన్నర తర్వాత ఇసుక కూపన్లకు లంచం తీసుకుంటూ మరో డిప్యూటీ తహసీల్దార్‌ ఏసీబీకి పట్టుబడ్డాడు. మరోసారి ఏసీబీ దాడులు నిర్వహించేందుకు సమయాత్తమవుతున్న తరుణంలో లంచం అడిగిన అధికారి ఒకరు తెలివిగా విధులకు డుమ్మా కొట్టి తప్పించుకోగలిగాడు. వరుసగా ఈ కార్యాలయంలోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఉద్యోగులు ఏ మాత్రం భయం లేకుండా లంచం డిమాండ్‌ చేయడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆరేళ్ల వ్యవధిలో మూడుసార్లు తహసీల్‌ కార్యాలయ ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడడం మండలంలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు లంచం డిమాండ్‌ చేస్తే ప్రజలు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. అయినా అధికారులు, ఉద్యోగులు మాత్రం తమ ప్రవర్తన మార్చుకోవడం లేదు.

వీడియో తీసిన రైతు..

అశ్వాపురం మండలంలో ఓ రైతు తన అవసరాల నిమిత్తం పొలం అమ్మగా కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్‌ చేసేందుకు తహసీల్దార్‌ రూ.15 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో రూ.5వేలు ఇస్తానని ఒప్పుకున్న రైతు.. తహసీల్దార్‌కు లంచం ఇస్తూ తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శనివారం సదరు తహసీల్దార్‌పై బదిలీ వేటు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement