
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
● ప్రతిరోజూ అలవాటుగా మార్చుకోవాలి ● ఎస్పీ రోహిత్రాజు
సూపర్బజార్(కొత్తగూడెం): నిత్యం యోగా చేయడంతో పని ఒత్తిడి నుంచి ఉపశమనంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎస్పీ రోహిత్రాజు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో శనివారం శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆనందమైన జీవితానికి ప్రతి ఒక్కరూ రోజూ యోగా చేయాలని సూచించారు. ప్రపంచదేశాలు యోగా ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రత్యేక గుర్తింపు ఇచ్చాయని అన్నారు. పనిపై శ్రద్ధ పెరగడానికి, మానసిక ప్రశాంతతకు యోగా ఉపయోగపడుతుందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బందితో యోగాసనాలు, ధ్యానం, శ్వాసపై ధ్యాస, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం తదితర ఆసనాలు వేయించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేందర్, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, డీసీఆర్బీ, ఏఆర్ డీఎస్పీలు మల్లయ్యస్వామి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
భారతీయుల అమూల్య సంపద..
భద్రాచలం : యోగా భారతీయుల అమూల్య సంపద అని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా ఐటీడీఏ ట్రైబల్ మ్యూజియంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచానికి యోగాను పరిచయం చేసిన ఘనత భారతీయులదని, అది నేడు అందరికీ అనురణీయంగా మారిందని అన్నారు. యోగాసనాలతో మానసిక ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. విద్యార్థులతో నిత్యం యోగా చేయించాలని గిరిజన సంక్షేమ పాఠశాలల హెచ్ఎంలు, వార్డెన్లు, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ.. యోగా శారీరక వ్యాయామం మాత్రమే కాదని, దీంతో ఆరోగ్య, ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉంటాయని తెలిపా రు. యోగా గురువు గుమలాపురం సత్యనారా యణ మాట్లాడుతూ.. విద్యార్థులు నిత్యం యో గా చేస్తే మేధాశక్తి నైపుణ్యాలు పెరుగుతాయని సూచించారు. కార్యక్రమంలో ఏఓ సున్నం రాంబాబు, ఎస్ఓ భాస్కరన్, ఏటీడీఓ అశోక్ కుమార్, క్రీడాధికారి గోపాలరావు, జీసీడీఓ అలివేలు మంగతాయారు తదితరులు పాల్గొన్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం