
వెల్లువలా వినతులు
● జిల్లాలో 529 భూ భారతి సదస్సులు.. ● 58,345 దరఖాస్తులు
సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో నిర్వహించిన భూ భారతి అవగాహనా సదస్సుల్లో వివిధ సమస్యలపై దరఖాస్తులు వెల్లువెత్తాయి. జిల్లా వ్యాప్తంగా 529 సదస్సులు జరగగా.. 58,345 వినతులు వచ్చాయి. కొత్తగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలోని సుజాతనగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయగా, ఇక్కడ నిర్వహించిన సదస్సుల్లో 649 మంది పలు రకాల భూ సమస్యలపై వినతులు సమర్పించారు. ఈ డివిజన్లో మొత్తం 15 మండలాలు ఉండగా మిగిలిన 14 మండలాల్లో 45,698 దరఖాస్తులు వచ్చాయి. భద్రాచలం డివిజన్లోని 8 మండలాల్లో 207 సదస్సులు జరగగా 12,657 దరఖాస్తులు వచ్చాయి. కొత్తగూడెం ఆర్డీఓ మధు, భద్రాచలం ఆర్డీఓ దామోదర్రావు ఆయా డివిజన్లలో సదస్సులను పర్యవేక్షించారు. పలుచోట్ల కలెక్టర్ జితేష్ వి పాటిల్ హాజరై భూ భారతి సదస్సుల ప్రాధాన్యతను రైతులకు వివరించారు. ప్రధానంగా సాదాబైనామా, అసైన్మెంట్ భూముల రిజిస్ట్రేషన్, భూముల సర్వే సరిహద్దుల సమస్యలపై ఎక్కువగా దరఖాస్తులు అందాయని, వీటిపై సమగ్ర విచారణ చేస్తామని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తెలిపారు.