
చదువుకొనగలుగుతారా..?
ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టారాజ్యం
● పుస్తకాల పేరుతోనూ దోపిడీ.. ● కానరాని మైదానాలు, ఫీజుల పట్టికలు ● ఆర్థికభారంతో అవస్థలు పడుతున్న తల్లిదండ్రులు ● పర్యవేక్షణపై పట్టింపు లేని అధికారులు
కొత్తగూడెంఅర్బన్: పిల్లలను అత్యున్నస్థాయిలో చూసేందుకు తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలో చేర్పిస్తుంటారు. కానీ, ఆయా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు మోపే ఆర్థిక భారాన్ని భరించలేకపోతున్నారు. తల్లిదండ్రుల ఆశను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వారు అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలు కూడా మెరుగైన సౌకర్యాలతో ప్రైవేట్కు దీటుగా మారుతున్నాయి. విద్యాబోధన కూడా అదేస్థాయిలో ఉండటంతోపేద, మధ్యతరగతి వారు ఆనందం వ్యక్తం చేస్తు న్నారు. ప్రభుత్వ పాఠశాల ఉన్న దగ్గర ఐదు కిలోమీటర్ల వరకు మరో ప్రైవేట్ పాఠశాల ఏర్పాటు చేయడానికి వీలు లేదు. నిబంధనలు కూడా ఒప్పుకోవు. కానీ, విద్యాధికారుల సహకారం ఉండడం వల్ల పాఠశాలలు ఏర్పాటు చేసుకొని లక్షల్లో దోచుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 220కి పైగా ప్రైవేట్ పాఠశాలలున్నాయి. అందులో ఎన్ని పాఠశాలలకు అనుమతులున్నాయి? ఎన్ని రెన్యూవల్ అయ్యాయి? అనే సమాచారం కూడా జిల్లా విద్యాశాఖాధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఎంఈఓలు కూడా సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారంటే విషయం అర్థమైపోతోంది.
పుస్తకాల దందా..
ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాల ధరలు కూడా అధికంగా ఉన్నాయి. ఏదైనా ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థి చేరితే ఆ పాఠశాల ప్రింట్ చేసిన నోట్బుక్స్, పాఠ్య పుస్తకాలు మాత్ర మే చదవాలి.. రాయాలి. బయట నుంచి కొను గోలు చేస్తే అనుమతించరు. బయట బుక్స్టాల్లో రూ.30కి దొరికే నోట్బుక్ రూ.50కి అమ్ముతున్నారు. వీటిని సమీపంలోని ఇళ్లు, షెట్టర్లలో పెట్టి విక్రయిస్తున్నారు. ఇక 6వ తరగతి నుంచి ఐఐటీ విద్యను బోధిస్తామని అదనంగా రూ.5 వేలు దండుకుంటున్నట్లు సమాచారం. కార్పొరేట్ పాఠశాల లు ఎల్కేజీ నుంచి రూ.లక్ష వసూలు చేస్తే, మిగతారావు సదుపాయాలను బట్టి రూ.30 నుంచి రూ.50 వేలు వసూలు చేస్తున్నారు.