
ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
మణుగూరుటౌన్: బీటీపీఎస్ యాష్ ప్లాంట్ నుంచి బూడిద కట్టల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పినపాక మండ లం బోటిగూడెం పంచాయతీ మారేడుగూడెంనకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రామారావు (48).. బీటీపీఎస్ యాష్ప్లాంట్ నుంచి బూడిద కట్టలను మరో చోటికి ట్రాక్టర్లో తరలిస్తున్నాడు. మార్గమధ్యలో చెరువుకట్ట పైనుంచి అదుపుతప్పి 15 అడుగుల లోతులో ట్రాక్టర్ బోల్తా పడటంతో రామారావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మణుగూరు 100 పడకల ఆస్పత్రికి తరలించారు.
చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
అశ్వారావుపేటరూరల్: ఓ ఆలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరిని శుక్రవారం స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ యయాతిరాజు కథనం ప్రకారం.. మండలంలోని గుమ్మడవల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్ట్ వద్దగల శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంలో ఈ నెల 12వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హుండీల తాళాలను ధ్వంసం చేసి అందులోని నగదును అపహరించిన సంగతి తెలిసిందే. కాగా, అశ్వారావుపేట ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఎస్ఐ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కమ్మరిగూడేనికి చెందిన సబ్కా కాంతారావు, పాయం అనిల్ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా చోరీకి చేసినట్లు ఒప్పుకున్నారు. వారి నుంచి రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.
21 కేజీల గంజాయి పట్టివేత
భద్రాచలంఅర్బన్: కారులో తరలిస్తున్న 21 కేజీల గంజాయిని కూనవరం రోడ్డులోని ఆర్టీఏ చెక్పోస్టు వద్ద శుక్రవారం రాత్రి టౌన్ పోలీసులు పట్టుకున్నారు. టౌన్ ఎస్ఐ సతీశ్ సిబ్బందితో కలిసి కూనవరం రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో ఓ కారును ఆపి తనిఖీ చేశారు. అందులో 21 కేజీల గంజాయి లభించింది. హైదరాబాద్కు చెందిన బాలకృష్ణ, వెంకటేశ్ ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. గంజాయి విలువ రూ.12 లక్షలు ఉంటుందని, నిందితుల ఫోన్లు సీజ్ చేసి కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి