
ఇరవెండిలో పోడు వివాదం..
బూర్గంపాడు: ఇరవెండి ఫారెస్ట్ బీట్లోని కొసగుంపు వలస ఆదివాసీ గ్రామంలో శుక్రవారం పోడు భూములపై వివాదం చోటుచేసుకుంది. కందకాలు తవ్వేందుకు వెళ్లిన జేసీబీని కొసగుంపునకు చెందిన వలస ఆదివాసీ మహిళలు అడ్డుకున్నారు. ఫారెస్ట్ అధికారులు మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికి వారు వినకపోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాము సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో కందకాలు తవ్వొద్దని మహిళలు కోరగా.. గ్రామపెద్దలతో చర్చించిన తర్వాతనే తవ్వకాలు చేపట్టామని ఫారెస్ట్ అధికారులు వివరించారు. వాగ్వాదం పెరిగి ఘర్షణ వాతావరణం నెలకొనగా.. ఫారెస్ట్ అధికారులు తమపై దాడి చేశారని మహిళలు ఆరోపించారు. ఈ విషయమై అశ్వాపురం ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేశ్ను వివరణ కోరగా.. కొసగుంపు గ్రామస్తులు, పెద్దలతో రెండు నెలలుగా చర్చించిన తరువాతనే సామరస్యంగా మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టామన్నారు. మహిళలు అక్కడకు వచ్చి పనులను అడ్డుకున్నారని, ఫారెస్ట్ సిబ్బందిని దుర్భాషలాడారని తెలిపారు. తిరిగి తామే దాడికి పాల్పడ్డామని ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఇదిలాఉండగా ఫారెస్ట్ అధికారులు తమపై దాడులకు పాల్పడ్డారని, వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు మహిళలు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు, ఎస్ఐ రాజేశ్కు ఫిర్యాదు చేశారు.
ఫారెస్ట్ అధికారులు కందకాలు
తవ్వుతుండగా అడ్డుకున్న గిరిజనులు