
మెరుగైన చికిత్స అందించాలి
● వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్కుమార్ ● పాల్వంచ సీహెచ్సీలో తనిఖీలు
పాల్వంచ: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందించాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ అన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సతీమణి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ అయిన నేపథ్యంలో పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించేందుకు గురువారం ఆయన సీహెచ్సీకి వచ్చారు. అన్ని వార్డుల్లో తిరుగుతూ ఎలా చికిత్స అందుతోందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులు, ఆపరేషన్ థియేటర్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వివిధ రకాల జబ్బులతో ఆస్పత్రికి వచ్చే బాధితులతో మమేకమై చికిత్స అందించాలని, విధుల్లో లోటుపాట్లు ఉండొద్దని, సమయ పాలన పాటించాలని సూచించారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్లో వైద్యులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో అజయ్కుమార్, కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. అంకిత భావంతో పనిచేస్తే ఉద్యోగులకు మంచి పేరు వస్తుందని అన్నారు. అనంతరం జిల్లాలోని ఏడు వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్న 80 మంది సిబ్బందికి సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంప్రసాద్, ఆర్ఎంఓ డాక్టర్ సోమరాజు దొర, డాక్టర్ ముక్కంటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.