సమయపాలన పాటించేలా.. | - | Sakshi
Sakshi News home page

సమయపాలన పాటించేలా..

Jun 20 2025 5:45 AM | Updated on Jun 20 2025 5:45 AM

సమయపా

సమయపాలన పాటించేలా..

● పంచాయతీరాజ్‌లో ముఖ గుర్తింపు హాజరు పద్ధతికి కసరత్తు ● ఇప్పటికే గ్రామపంచాయతీ కార్యదర్శులకు వర్తింపు ● త్వరలో మండల పరిషత్‌ల్లో అమలుకు చర్యలు

ఇల్లెందురూరల్‌: అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించేలా పంచాయతీరాజ్‌ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే విద్య, వైద్య విభాగాల్లో ప్రయోగాత్మకంగా పలు జిల్లాల్లో అమలు చేస్తున్న ముఖగుర్తింపు హాజరు విధానాన్ని ప్రస్తుతం పంచాయతీల్లో ప్రత్యేక యాప్‌ ద్వారా కార్యదర్శులకు అమలు చేస్తోంది. ఇదే విధానాన్ని మండల పరిషత్‌ కార్యాలయాల్లో కూడా అమలు చేయనుంది.

సామగ్రి చేరక జాప్యం..

ఈ నెల 16వ తేదీ నుంచి అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నా ముఖ గుర్తింపు హాజరుకు సంబంధించిన సామగ్రి కార్యాలయాలకు చేరకపోవడంతో జాప్యం జరుగుతోంది. కాగా నూతన హాజరు విధానం కోసం ఎంపీడీఓ, ఎంపీఓ, పర్యవేక్షకులు, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, పీఆర్‌ ఏఈలు, గృహనిర్మాణ శాఖ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ ఏపీవోలు, టీఏలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఉద్యోగులు, సిబ్బంది వివరాలు, ఆధార్‌కార్డుల వివరాల సేకరణ మొదలు పెట్టారు. సంబంధిత సామగ్రి రాగానే నూతన విధానాన్ని అమలు చేయనున్నారు. ఉదయం విధులకు రాగానే, సాయంత్రం విధులు పూర్తయ్యాక రెండుసార్లు ముఖ గుర్తింపుతో హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. దీనికి జీపీఎస్‌ను అనుసంధానం చేస్తారు. ఇలా నమోదైన రోజు వారీ హాజరు నివేదికను రాష్ట్ర కార్యాలయాలకు పంపుతారు.

ఇతర విభాగాల్లోనూ కసరత్తు

2019లో మహబూబాబాద్‌ జిల్లాలోని మండల స్థాయి కార్యాలయాల్లో అప్పటి కలెక్టర్‌ శివలింగయ్య బయోమెట్రిక్‌ విధానంలో ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని ప్రారంభించారు. ఏడాదిన్నరపాటు సాఫీగా సాగినా కరోనా సమయంలో రద్దయింది. వైద్యశాఖలోనూ ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ఖమ్మం జిల్లాలో అమలు చేశారు. ఇక్కడ విజయవంతం కావడంతో అన్ని జిల్లాల్లో ప్రారంభించేందుకు వైద్యశాఖ కసరత్తు చేస్తోంది. విద్యాశాఖలో విద్యార్థుల హాజరును ముఖగుర్తింపు పద్ధతిలో అమలు చేస్తుండగా, ఈ విధానాన్ని ఉపాధ్యాయులకు కూడా వర్తింపజేసేందుకు విద్యాశాఖ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఉత్తర్వులు అందాయి..

మండల పరిషత్‌ కార్యాలయాల్లో ముఖగుర్తింపు హాజరు విధానం అమలు చేయాలని పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి ఉత్తర్వులు అందాయి. దీనికి సంబంధించి బయోమెట్రిక్‌, ఇతర యంత్ర సామగ్రి అందుబాటులోకి రాగానే నూతన విధానం ప్రకారం హాజరు నమోదు ప్రారంభిస్తాం.

– ధన్‌సింగ్‌, ఎంపీడీఓ, ఇల్లెందు

గతంలో వేలిముద్ర ప్రయోగం

ఉద్యోగులు సమయ పాలన పాటించేలా గతంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వేలిముద్ర హాజరు విధానం ఉండేది. సంబంధిత యంత్రాలు సక్రమంగా పనిచేయకపోవడంతో అనతికాలంలోనే హాజరు పట్టికలో సంతకం విధానం కొనసాగుతోంది. దీంతో ఎప్పటిలాగే ఉద్యోగులు ఆలస్యంగా రావడం, తొందరగా వెళ్లడం, విధులకు రాకపోయినా మరుసటి రోజు వచ్చి సంతకాలు చేయడం వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యానికి చెక్‌ పెట్టేలా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మండల పరిషత్‌ కార్యాలయాల్లో ముఖ గుర్తింపు హాజరు విధానం అమలుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేశారు.

సమయపాలన పాటించేలా..1
1/2

సమయపాలన పాటించేలా..

సమయపాలన పాటించేలా..2
2/2

సమయపాలన పాటించేలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement