మెరుగైన సౌకర్యాలు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

Jun 20 2025 5:45 AM | Updated on Jun 20 2025 5:45 AM

మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

డీఎంహెచ్‌ఓ భాస్కర్‌ నాయక్‌

భద్రాచలంటౌన్‌: బాధితులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని డీఎంహెచ్‌ఓ భాస్కర్‌ నాయక్‌ ఆదేశించారు. భద్రాచలం పట్టణంలోని డీ అడిక్షన్‌ సెంటర్‌ను గురువారం ఆయన సందర్శించారు. రోగులతో మాట్లాడి చికిత్స అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. వ్యసనాలకు బానిసలైన వ్యక్తులు వాటి నుంచి బయటపడేందుకు మానసిక నిపుణులతో కలిసి కౌన్సెలింగ్‌ అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు ఎస్‌.జయలక్ష్మి, ఉదయ్‌, చైతన్య, ఫైజ్‌మోహినుద్దీన్‌, బి.సోమ్లా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

26న నిరుపయోగ

వస్తువుల వేలం

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లా పోలీస్‌ శాఖలో వివిధ విభాగాల్లో నిరుపయోగంగా ఉన్న వస్తువులను ఈ నెల 26న ఉదయం 10 గంటలకు హేమచంద్రాపురంలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో బహిరంగ వేలం పాట ద్వారా విక్రయించనున్నట్లు ఎస్పీ రోహిత్‌రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్‌ మానిటర్లు, సీపీయూలు, కీ బోర్డులు, మౌస్‌లు, యూపీఎస్‌లు, ట్యాబ్‌లు, యాపిల్‌ ఐప్యాడ్‌లు, ఇన్వర్టర్‌, ఇన్వర్టర్‌ బ్యాటరీలు, డ్రాగన్‌ లైట్లు, టార్చ్‌లైట్లు, క్లాత్‌ టెంట్లు, టేబుళ్లు, కుర్చీలు, బీరువాలు, ఫర్నిచర్‌ సామగ్రి, ఇతర వస్తువులను వేలం వేస్తామని వివరించారు. ఆసక్తి కలిగినవారు ఒరిజినల్‌ ఆధార్‌కార్డుతో పాటు ఒక జిరాక్స్‌ కాపీ తీసుకుని ఆర్‌ఐ అడ్మిన్‌ షేక్‌ లాల్‌బాబును 87126 82143 నంబరులో సంప్రదించాలని సూచించారు.

రెండు బైక్‌లు ఢీ :

నలుగురికి తీవ్ర గాయాలు

ఇల్లెందురూరల్‌: మండలంలోని సుభాష్‌నగర్‌ గ్రామపంచాయతీ శివారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. సుభాష్‌నగర్‌కు చెందిన చీకటి రాకేష్‌ బైక్‌పై జగదాంబగుంపునకు బయలుదేరాడు. అదే సమయంలో రాఘబోయినగూడెం గ్రామపంచాయతీ మొట్లగూడెం గ్రామానికి చెందిన కల్తి ప్రవీణ్‌, సూర్నపాక శ్రీను, సూర్నపాక ఆదిలక్ష్మి మరో బైక్‌పై కొత్తగూడెం నుంచి ఇల్లెందు వైపు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న చీకటి రాకేష్‌, కల్తి ప్రవీణ్‌లను ఖమ్మం సిఫారసు చేశారు. ఇల్లెందు పోలీసులు కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఇల్లెందురూరల్‌: పోచారంతండా, కొమరారం గ్రామాల మధ్య గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పోచారంతండా గ్రామపంచాయతీ అమర్‌సింగ్‌తండా గ్రామానికి చెందిన గుగులోత్‌ బాలునాయక్‌ (45) బైక్‌పై కొమరారం వస్తుండగా మార్గమధ్యలో వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో తలకు తీవ్రంగా గాయమైంది. అదే మార్గంలో వెళుతున్న వ్యక్తులు ప్రమాదాన్ని గుర్తించి బాలునాయక్‌ను కొమరారం పీహెచ్‌సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. కొమరారం పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

గ్రానైట్‌ వ్యాపారి అరెస్ట్‌

ఖమ్మంక్రైం: మహిళపై అత్యాచారానికి పాల్ప డిన కేసులో ఓ గ్రానైట్‌ వ్యాపారిని గురువారం అరెస్ట్‌ చేసినట్లు ఖమ్మం త్రీటౌన్‌ సీఐ మోహన్‌బాబు తెలిపారు. ఖమ్మం త్రీటౌన్‌ ప్రాంతంలో నివసించే ఓ కుటుంబంతో కలిసి అదే ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లు గ్రానైట్‌ వ్యాపారం చేస్తున్నాడు. తరచుగా వారి ఇంటికి వెళ్లే వెంకటేశ్వర్లు ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేశామని సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement