
యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ..
సూపర్బజార్(కొత్తగూడెం): యుద్ధోన్మాదాన్ని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం ప్రదర్శన నిర్వహించారు. వామపక్ష పార్టీ జాతీయ కమిటీల పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. సీపీఐ, సీపీఎం, న్యూ డెమోక్రసీ కార్యాలయాల నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ అమెరికా తన ఆయుధ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు వివిధ దేశాల మధ్య చిచ్చుపెడుతూ యుద్ధాలకు ప్రేరేపిస్తోందని, ఇజ్రాయిల్–ఇరాన్ యుద్ధం ట్రంప్ సామ్రాజ్యవాద కాంక్షకు పరాకాష్ట అని విమర్శించారు. ప్రపంచ దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకుని అమెరికా కర్రపెత్తనం చేస్తోందని ఆరోపించారు. రెండు దశాబ్దాలుగా పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ నిరంతర బాంబు, వైమానిక దాడులకు పాల్పడుతూ లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంటూ మారణ హోమాన్ని సృష్టిస్తోందని అన్నారు. అంతర్జాతీయ చట్టాలు, మానవ హక్కులు హరించుకుపోతున్న పరిస్థితిలో పాలస్తీనా ప్రజలకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. అమెరికా ముందు మోకరిల్లే విధానాలకు స్వస్తి చెప్పి ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంపై ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు వ్యతిరేకంగా నోరు విప్పాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్పాషా, సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ఆవునూరి మధు, మాస్లైన్ జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం, న్యూడెమోక్రసీ నాయకుడు కందగట్ల సురేందర్ కూడా మాట్లాడారు.
వామపక్షాల ఆధ్వర్యంలో
నిరసన ప్రదర్శన