
మంత్రి పదవులు ఇవ్వకుంటే గుణపాఠం చెబుతాం
ఖమ్మం మామిళ్లగూడెం: యాదవులు, మున్నూరు కాపులతో పాటు ఎంబీసీలకు మంత్రి పదవులు ఇవ్వకుంటే కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెబుతామని తెలంగాణ రాష్ట్ర బీసీ జనసభ అధ్యక్షుడు డి.రాజారాంయాదవ్ హెచ్చరించారు. ఖమ్మంలో గురువారం ‘బీసీల రిజర్వేషన్లు, మంత్రి పదవుల కేటాయింపు’అంశంపై తెలంగాణ యాదవ మహాసభ జిల్లా కార్యదర్శి గుమ్మా రోశయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి యాదవులు, మున్నూరుకాపులు, ఎంబీసీలు సహకరించగా, యూపీఏ–1, 2 ప్రభుత్వం మనుగడలోనూ ములాయంసింగ్ యాదవ్, లాలూప్రసాద్ యాదవ్ కృషి ఉందని తెలిపారు. ఈమేరకు సీఎం రేవంత్రెడ్డి యాదవజాతిని నిర్లక్ష్యంగా చూడడం సరికాదన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సూచనల మేరకు ఇకనైనా మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై 30వ తేదీన యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యాన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని రాజారాం కోరారు. సదస్సులో డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మున్నూరు కాపు సంఘం నాయకుడు గుండాల కృష్ణ, గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శి అమరగాని వెంకన్నగౌడ్, తెలంగాణ యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు కోడి లింగయ్య యాదవ్తో పాటు వివిధ సంఘాల నాయకులు ఎర్రబోయిన గోవిందరావు, గోవర్దన్, మేకల కృష్ణ, మధు, బారీ మల్సూర్, చిత్తారు ఇందుమతి, జడ మల్లేష్, జంగా సత్యనారాయణ, మీగడ రామారావు తదితరులు పాల్గొన్నారు.