
పర్యావరణానికి ప్రాధాన్యం ఇవ్వాలి
కరకగూడెం: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఈపీటీఆర్ఐ) బృందం సభ్యులు సూచించారు. మండలంలోని రఘునాథపాలెం, చిరుమళ్ల, కలవలనాగారం, నర్సాపురం అటవీ ప్రాంతాల్లో కంపా నిధులతో చేపట్టిన వివిధ పనుల పురోగతిని బుధవారం వారు పరిశీలించారు. చెక్ డ్యామ్లు, ఫైర్ లైన్స్, ప్లాంటేషన్, చెక్ పీడీల కొలతలు సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అటవీ ప్రాంతాల్లో చెక్ డ్యామ్ల నిర్మాణంతో భూగర్భ జలమట్టాలు పెరుగుతాయని, ఇది పర్యావరణ సమతుల్యతకు చాలా అవసరమని అన్నారు. అలాగే వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా భూమిలోకి ఇంకి, వేసవిలో కూడా పచ్చదనాన్ని కాపాడేందుకు ఉపకరిస్తాయని తెలిపారు. మొక్కల పెరుగుదల బాగుందని, సరైన మొక్కలను ఎంచుకోవడం, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవడంతో సత్ఫలితాలు కనిపిస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బృందం సభ్యులు ఎండీ నసీర్ పాషా, పద్మజ, శిరీష, ఏడూళ్ల బయ్యారం రేంజర్ తేజస్వి పాల్గొన్నారు.
అటవీ పనుల పురోగతిపై
ఈపీటీఆర్ఐ బృందం అధ్యయనం