గురుకులాల్లో.. లోటుపాట్లు ఉండొద్దు | - | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో.. లోటుపాట్లు ఉండొద్దు

Jun 19 2025 4:12 AM | Updated on Jun 19 2025 4:12 AM

గురుకులాల్లో.. లోటుపాట్లు ఉండొద్దు

గురుకులాల్లో.. లోటుపాట్లు ఉండొద్దు

ఖమ్మంమయూరిసెంటర్‌: ప్రభుత్వ నిబంధనల ప్రకారం గురుకులాల నిర్వహణ కొనసాగాలని డిప్యూటీ సీఎం మల్లు భటి విక్రమార్క, రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా, ఎకై ్సజ్‌ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ఖమ్మం కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్లు అనుదీప్‌ దురిశెట్టి, జితేష్‌ వి.పాటిల్‌, సీపీ సునీల్‌దత్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురుకులాలు, వసతిగృహాల నిర్వహణ, బీసీ సంక్షేమ, రవాణా, ఎకై ్సజ్‌ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు, వనమహోత్సవం నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. సరైన వసతులు లేని గురుకులాలను ప్రత్యామ్నాయ భవనాల్లోకి మార్చాలని, ఎక్కడా దోమల బెడద లేకుండా జాలీలు ఏర్పాటు చేయాలని సూచించారు. కామన్‌ డైట్‌ కచ్చితంగా అమలయ్యేలా జిల్లా అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గురుకులాలు, హాస్టళ్లను తనిఖీ చేయాలని తెలిపారు. మొక్కలు నాటేందుకు గతంలో రూ.వేల కోట్లు ఖర్చు చేసినా, ఎన్ని బతికాయో లెక్కలు చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. ఈసారి అలాకాకుండా మొక్కల పెంపకాన్ని బాధ్యతగా భావించాలని సూచించారు. కాగా, బస్సు సర్వీసులు అవసరమైన గ్రామీణ రూట్లపై ప్రతిపాదనలు సమర్పిస్తే నూతన బస్సులు కొనుగోలు చేస్తామని తెలిపారు.

ఐఐటీ, నీట్‌పై శిక్షణ అందించాలి..

గురుకులాల్లో విద్యాప్రమాణాలు మరింత మెరుగుపరుస్తూ, ఐఐటీ, నీట్‌ల్లో మంచి ఫలితాలు సాధించేలా శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించారు. పెరిగిన డైట్‌ చార్జీల ఆధారంగా కామన్‌ డైట్‌ అమలు చేయాలని తెలిపారు. గ్రామీణ యువత ఉద్యోగాలు సాధించేలా బీసీ స్టడీ సర్కిల్‌లో శిక్షణ ఇవ్వాలన్నారు. ఈ ఏడాది వన మహోత్సవంలో ఈత, తాటి మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తూ గీత కార్మికులను భాగస్వామ్యం చేయాలని కోరారు. మున్సిపల్‌ కార్పొరేషన్ల కమిషనర్లు పీఎంఈ స్కీం ద్వారా ఎలక్ట్రికల్‌ బస్సులు తీసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. రాష్ట్ర గిడ్డంగులు, హస్తకళా సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, ఖమ్మం మేయర్‌ పి.నీరజ, అదనపు కలెక్టర్లు డాక్టర్‌ పి.శ్రీజ, పి. శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

ఉన్నతాధికారులు తరచూ తనిఖీ చేయాలి

అవసరమైన అన్ని ప్రాంతాలకూ బస్సు సర్వీసులు

ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement