
కరకట్ట పరిసరాలు శుభ్రంగా ఉండాలి
భద్రాచలంఅర్బన్ : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని, వారంతా గోదావరిలో స్నానమాచరించే అవకాశం ఉన్నందున కరకట్ట ప్రాంతాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. గోదావరి కరకట్ట పక్కనున్న అనధికార డంపింగ్ యార్డ్లో బుధవారం కొందరు చెత్తకు నిప్పంటించగా భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించిన పీఓ.. గ్రామ పంచాయతీ ఈఓ శ్రీనివాసరావుకు పలు సూచనలు చేశారు. కరకట్ట ప్రదేశాల్లో చెత్త వేయకుండా సిబ్బందిని కాపలా ఉంచాలని, సేకరించిన చెత్తను కొత్తగా నిర్మించిన డంపింగ్ యార్డ్లోనే వేయాలని ఆదేశించారు.
ధర్తీ ఆభా యోజనను సద్వినియోగం
చేసుకోవాలి
బూర్గంపాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ధర్తీ ఆభా యోజన పథకాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలని పీఓ రాహుల్ అన్నారు. కృష్ణసాగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ గిరిజనుల సౌకర్యార్థం ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని, జిల్లాలోని 130 పంచాయతీయలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. ఈ పథకం ద్వారా గిరిజన కుటుంబాల వారికి అవసరమైన గుర్తింపు కార్డులు అందిస్తామన్నారు. మీ సేవ కేంద్రాలకు, నెట్ సెంటర్లకు వెళ్లకుండా అధికారులు ఇంటికే వచ్చి అందజేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయా గ్రామాలకు వచ్చిన అధికారులను కలిసి గుర్తింపు కార్డుల కోసం రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీఓ బాలయ్య, ఏఓ శంకర్, పీఏఓ విజయలక్ష్మి, ఏపీఎం నాగార్జున తదితరులు పాల్గొన్నారు. అనంతరం గిరిజన గురుకుల సంక్షేమ కళాశాలను సందర్శించారు. విద్యార్థులు డ్రాపౌట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్, అధ్యాపకులకు సూచించారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని, వారు మాదక ద్రవ్యాలకు అలవాటుపడకుండా ప్రత్యేక నిఘా పెట్టాలని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.
పంచాయతీ సిబ్బందికి పీఓ ఆదేశం