
ఫలరాజు ఫలించేలా..
యాజమాన్య పద్ధతితో అధిక లాభాలు
● నేల సారవంతానికి దుక్కులు అవసరం ● కొమ్మ కత్తిరింపులతో తెగుళ్ల నివారణ ● వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్
వైరా: దేశంలో పండించే పండ్ల తోటల్లో ప్రధానమైనది, ఫలరాజుగా పేరుగాంచినది మామిడి. అయితే దీని సాగు విస్తీర్ణం దేశంలో మొత్తం 35శాతం ఉండగా.. 22,58,130 హెక్టార్లలో విస్తరించి ఉంది. రాష్ట్రంలో 1,15,990 హెక్టార్లు, జిల్లాలో 13,674 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. సాధారణంగా మామిడి రైతులు పూత, కాత దశలో మాత్రమే మామిడి తోటలపై దృష్టి సారించి చెట్టుకు కావాల్సిన ఎరువులు అందిస్తుంటారు. దీని వలన సరైన పోషకాలు అందక పూత సకాలంలో రాకపోవడం, వచ్చిన పూత, పిందె సరిగా నిలవక దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యాన అధిక దిగుబడులు సాధించేందుకు కోత అనంతరం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలని వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్ సూచిస్తున్నారు.
కొమ్మ కత్తిరింపులు..
● మామిడి కాయ కోత అనంతరం కాయ తొడిమలున్న కొమ్మలు, ఎండిన కొమ్మలు, తెగులు సోకిన, విరిగిన కొమ్మలు, చెట్ల లోపల గాలి, వెలుతురు ప్రవేశానికి అడ్డుగా ఉన్న కొమ్మలను కత్తిరించాలి.
● పూత కాడల నుంచి వెనుకకు 15 సెంటీ మీటర్లు వరకు కత్తిరిస్తే నవంబర్, డిసెంబర్లలో కొత్త కొమ్మలు పుట్టుకొచ్చి, అవే వచ్చే రుతువులో పుష్పిస్తాయి.
● ప్రతీ రెమ్మ చివరి నుంచి 3–5 చిగుర్లు వస్తే ఆరోగ్యంగా ఉన్న రెండింటిని నిలుపుకొని మిగిలిన వాటిని తీసివేయాలి.
● కత్తిరింపులతో కొంత మేర తెగుళ్లు తగ్గే అవకాశం ఉండగా.. కత్తిరించిన కొమ్మ భాగాలకు బోర్డ్ఫేస్ట్ పూయాలి లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములను లీటరు నీటికి కలిపి చెట్టంతా తడిచేలా పిచికారీ చేయాలి.
దుక్కి దున్నడం..
తొలకరిలో అనగా జూన్, జూలై మాసాలలో రైతాంగం చెట్ల మధ్యన దున్నాలి. దీని వలన కోశస్థ దశలో ఉన్న పురుగులు, కలుపు నివారించబడడడంతో పాటు నేల గుల్లబారి, వేర్లకు గాలి బాగా చేరి చెట్టు ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా నేలకు వర్షపు నీటిని పట్టి ఉంటే గుణం పెరిగి నేల సారవంతమవుతంది. మూడవ దుక్కి అక్టోబర్లో చేపడినట్లయితే నేలలో తేమ ఆరిపోయి సకాలంలో పూత రావడానికి దోహదపడుతుంది. దున్నేటప్పుడు చెట్టు నుంచి 1–5 మీటర్ల దూరంలో దున్నడం ఉత్తమం.