మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం

May 9 2025 12:27 AM | Updated on May 9 2025 12:27 AM

మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం

మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం

ఖమ్మం అర్బన్‌: మానవ వనరుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ, పకడ్బందీ చర్యలు చేపడుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రఘునాథపాలెంలో రూ.130 కోట్లతో నిర్మించే ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ భవన సముదాయానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.దామోదర రాజనర్సింహ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. మెడికల్‌ కాలేజీ భవన నిర్మాణానికి అవసరమైన భూమి, నిధులు సమకూర్చడంలో మంత్రులు కీలక పాత్ర పోషించారన్నారు. గత ప్రభుత్వం ఏటా సగటున వైద్య రంగానికి రూ.5,959 కోట్లు వెచ్చిస్తే, తాము ఒక్క ఏడాదిలోనే రూ.11,482 కోట్లు కేటాయించామని తెలిపారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. అంతేకాక అంతర్జాతీయ ప్రమాణాలతో 58 యంగ్‌ ఇండియా సమీకృత గురుకులాలను రూ.11,600 కోట్లతో నిర్మిస్తున్నామని తెలిపారు. అలాగే, 57 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న భట్టి, మరో 30 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. ఏదేమైనా ఉద్యోగులను తాము కాపాడుకుంటామని అన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఉద్యోగులకు ఏనాడు 15వ తేదీ లోపు జీతాలు ఇవ్వలేదని తెలిపారు.

వైద్య రంగానికి ప్రాధాన్యత

ప్రభుత్వం వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఖమ్మం మెడికల్‌ కళాశాలలో సీట్లు 150కి పెంచుతామని, జిల్లాలో 6 – 7 ప్రైమరీ హెల్త్‌ సెంటర్ల మంజూరుతో పాటు ఆర్గాన్‌ రిట్రైవల్‌ సెంటర్‌ కేటాయించనున్నామని చెప్పారు. వందనం, కొదుమూరు ప్రాంతంలో నర్సింగ్‌ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. అలాగే, ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటుతో మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తుందన్నారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైద్య కళాశాల శంకుస్థాపన ఆలస్యమైనా కార్యరూపం దాల్చడం ఆనందంగా ఉందని చెప్పారు. కార్యక్రమంల్లో వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, ఖమ్మం సీపీ సునీల్‌దత్‌, అదనపు కలెక్టర్లు డాక్టర్‌ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, వైద్యారోగ్యశాఖ సంచాలకులు డాక్టర్‌ నరేంద్ర కుమార్‌, టీజీఎంఐడీసీ ఎండీ ఫణీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

వైద్య, ఆరోగ్య శాఖకు

రూ.11,482 కోట్ల నిధులు

రఘునాథపాలెంలో మెడికల్‌ కాలేజీ నిర్మాణాలకు శంకుస్థాపన

పాల్గొన్న మంత్రులు దామోదర

రాజనర్సింహ, తుమ్మల, పొంగులేటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement