
యూడీఐఎస్ఈ పోర్టల్లో నమోదు చేయాలి
సూపర్బజార్(కొత్తగూడెం): ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన ప్రతీ విద్యార్థి వివరాలను యూడీఐఎస్ఈ+ పోర్టల్లో నమోదు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో గురువారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తీర్ణతలో బాలికల కంటే బాలురు వెనుకబడి ఉండడానికి గల కారణాలపై ఆరా తీసి పలు సూచనలు చేశారు. ఇంటర్లో కూడా డిజిటల్ బోధన, ఫేషియల్ అటెండెన్స్ ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూనియర్ కళాశాలల్లో అతిపెద్ద మైదానాలు ఉన్నప్పటికీ ఇంకుడు గుంతలు నిర్మించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని కళాశాలల్లో ఎకరానికి ఐదు చొప్పున ఇంకుడు గుంతలు నిర్మించాలని ఆదేశించారు. ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులకు, పోర్టల్లో నమోదైన సంఖ్యకు చాలా తేడాలున్నాయని, ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లతో చర్చించాలని జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ సతీష్కుమార్కు సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డీఐఈఓ వెంకటేశ్వరరావు, డీఈఓ వెంకటేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు.
కాంటాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
కాంటాక్ట్ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు ఈనెల 10వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్, పరిశ్రమల శాఖ జీఎం తిరుపతయ్య గురువారం ఒక ప్రకటనలో కోరారు. ప్రపంచ బ్యాంక్ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ర్యాంప్ పథకానికి కాంటాక్ట్ పద్ధతిలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు www.nimsme.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు కలెక్టరేట్లో పరిశ్రమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
ఇంటర్ ఫలితాలపై సమీక్షలో కలెక్టర్ పాటిల్