
ఫలితాలు అథమం.. అధికారుల ఆగ్రహం
● గురుకులాల్లో ఇంటర్ ఉత్తీర్ణత తగ్గడంపై సెక్రటరీ సీరియస్ ● ఎనిమిది మందికి షోకాజ్ నోటీసులు జారీ ● త్వరలో పది ఫలితాలపైనా అదే పంథా
భద్రాచలం: ఐటీడీఏ పరిధిలో నిర్వహిస్తున్న గురుకుల కళాశాలల్లో కొన్నిచోట్ల తక్కువ ఫలితాలు నమోదు కావడంపై గురుకులాల సెక్రటరీ కె.సీతాలక్ష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తక్కువ ఉత్తీర్ణత నమోదైన గురుకుల కళాశాలల ప్రిన్సిపాళ్లతో పాటు సబ్జెక్టు అధ్యాపకులకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఎనిమిది మంది నోటీసులు అందుకున్నారు. దీనిపై లిఖిత పూర్వక వివరణతో కూడిన నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఆ వివరణ సంతృప్తికరంగా లేకుంటే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
పదో తరగతిపైనా పోస్ట్మార్టమ్..
ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణత శాతం ఆశ్రమ పాఠశాలల్లో మెరుగుపడగా గురుకులాల్లో మాత్రం కొంత తగ్గింది. ఐటీడీఏ పరిధిలో ఉన్న 12 గురుకులాల్లో 849 మందికి 825 ఉత్తీర్ణులై 97.17 శాతం నమోదైంది. 2024లో ఇది 98.90 కాగా, ఈ ఏడాది 1.73 శాతం తక్కువగా ఫలితాలు వచ్చాయి. దీనిపైనా గురుకులం ఉన్నతాధికారులు పోస్ట్మార్టమ్ చేస్తున్నారు. కాగా ఇదే ఐటీడీఏ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో పది ఫలితాలు ఈ ఏడాది కొంత పెరిగాయి. ఐటీడీఏ పరిఽఽధిలో 45 ఆశ్రమ పాఠశాలలు, 13 వసతి గృహాలు, ఒక బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ఈ ఏడాది 93.05 శాతం ఫలితాలు వచ్చాయి. 2024లో ఈ ఫలితాలు 90.60 శాతం కాగా ఈ ఏడాది 2.45 ఉత్తీర్ణత శాతం పెరిగింది. తక్కువ ఫలితాలు నమోదైన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలపై పీఓ రాహుల్ సమీక్షిస్తున్నారు. తక్కువగా నమోదైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని గతంలోనే హెచ్చరిక జారీ చేసినప్పటికీ కొందరు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరికి సైతం త్వరలో షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 2024లో 11 మంది ప్రధానోపాధ్యాయులకు, 30 మంది సబ్జెకు టీచర్లుకు నోటీసులు అందజేశారు. కాగా, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ప్రధానోధ్యాయులు, ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసుల జారీపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
షోకాజ్ నోటీసులు సరికాదు
తక్కువ ఫలితాలు నమోదయ్యాయనే పేరుతో షోకాజ్ నోటీసులు జారీ చేయడం సరికాదు. అన్ని పాఠశాలల్లో చదివే విద్యార్థుల మేధస్సు ఒకేలా ఉండవు. వారిపై స్థానిక పరిసరాల ప్రభావం సైతం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫలితాలనే ప్రామాణికంగా తీసుకుని నోటీసులు జారీ చేయడం సబబు కాదు. ఉత్తమ ఫలితాలను సాధించడానికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలి.
– మునిగడప రామాచారి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు, టీఎఫ్టీఎఫ్ నేత
షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి
ఇంటర్లో తక్కువ ఫలితాలు నమోదైన కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఎనిమిది మందికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాటిని అందజేశాం. వీటిపై వారు వివరణ అందజేసిన అనంతరం తగు చర్యలు తీసుకుంటాం.
– ఆరుణకుమారి, గురుకులాల ఆర్సీఓ
సింగరేణి కళాశాలలో అతి తక్కువగా..
ఇటీవల ప్రకటించిన ఇంటర్ మీడియట్ ఫలితాల్లో కొన్ని కళాశాలల్లో ఉత్తీర్ణత ఆశాజనకంగానే ఉండగా, మరికొన్ని చోట్ల తక్కువగా నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాచలం స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లో 87.32 శాతం ఫలితాలు రాగా, అతి తక్కువగా సింగరేణి కళాశాలలో 34.62 శాతమే నమోదయ్యాయి. ఇంకా తిరుమలాయపాలెంలో 46.34, దమ్మపేటలో 57.58, కృష్ణసాగర్లో 62.90 శాతం మేర ఫలితాలు వచ్చాయి. 70 శాతం కంటే తక్కువ ఫలితాలు నమోదైన కళాశాలలపై గురుకుల ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా కళాశాలలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సెక్రటరీ.. ప్రిన్సిపాళ్లకు, అధ్యాపకులకు షోకాజ్ నోటీసుల ద్వారా వివరణ అడిగారు. నోటీసులు అందుకున్న వారిలో కృష్ణసాగర్ గురుకుల ప్రిన్సిపాల్, ఇద్దరు అధ్యాపకులు, సింగరేణి గురుకులం ప్రిన్సిపాల్తో పాటు మరో అధ్యాపకుడు, దమ్మపేట గురుకుల ప్రిన్సిపాల్, ఇద్దరు అధ్యాపకులకు, తిరుమలాయపాలెం గురుకులం ప్రిన్సిపాల్ ఉన్నారు. కాగా, గుండాల కళాశాల 100 శాతం ఫలితాలు సాధించి అధికారుల అభినందనలు అందుకుంది.

ఫలితాలు అథమం.. అధికారుల ఆగ్రహం

ఫలితాలు అథమం.. అధికారుల ఆగ్రహం