ముంపు ముప్పుపై.. మరో అధ్యయనం | - | Sakshi
Sakshi News home page

ముంపు ముప్పుపై.. మరో అధ్యయనం

May 7 2025 12:30 AM | Updated on May 7 2025 12:30 AM

ముంపు ముప్పుపై.. మరో అధ్యయనం

ముంపు ముప్పుపై.. మరో అధ్యయనం

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: పోలవరం ప్రాజెక్టు మొదలైన తర్వాత 2022 జూలైలో వచ్చిన వరదలు నదీ పరివాహక ప్రాంతాలకు కొత్త అనుభవాలను చూపించాయి. బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై గతంలో వచ్చిన నివేదికల్లో పేర్కొన్న అంచనాలు ‘వరద’లో గల్లంతయ్యాయి. దీంతో బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై తిరిగి అధ్యయనం చేయాలనే డిమాండ్లు పెరిగాయి.

మరోసారి అధ్యయనం చేయాల్సిందే..

2022 గోదావరి వరదల తర్వాత పోలవరం బ్యాక్‌ వాటర్‌ ముంపు ప్రభావంపై మరోసారి అధ్యయనం చేయాల్సిందేనని తెలంగాణ సర్కారు డిమాండ్‌ చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు, గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తుండగా ఈ అభ్యంతరాలను ఏపీ ప్రభుత్వం కొట్టివేస్తూ వచ్చింది. చివరకు మరో సర్వేకు ఏపీ సర్కారు ఒప్పుకోక తప్పలేదు. ఈ మేరకు సీడబ్ల్యూసీ తరఫున వరద ముంపు ప్రభావంపై సర్వే జరగనుంది. అయితే 2016లో చేపట్టిన సర్వే ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడాన్ని దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ సర్కారు.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. అందులో భాగంగా పోలవరం బ్యాక్‌ వాటర్‌ ప్రభావం భద్రాచలం, దుమ్ముగూడెం, బూర్గంపాడు మండలాలపై ఏ మేరకు ఉంటుంది.. కిన్నెరసాని, ముర్రేడు వాగులపై ఎలాంటి ప్రభావం చూపతుందనే అంశంపై ఐఐటీ – హైదరాబాద్‌ ఇంజనీర్ల బృందంతో సర్వే చేయించాలని ఇరిగేషన్‌ శాఖకు గత జనవరి 5న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

తాజాగా కేంద్ర జల సంఘం సర్వే..

గోదావరికి గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వస్తే పోలవరం వెనుక వైపు 146 కి.మీ దూరంలో ఉన్న దుమ్ముగూడెం ఆనకట్ట వరకు ఎలాంటి ప్రభావం ఉంటుందో అధ్యయనం చేయాలని ఐఐటీ – హైదరాబాద్‌ను కోరుతూ రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ ఈ ఏడాది జనవరి 29న లేఖ రాసింది. దీంతో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయడానికి ముందు గతంలో ఈ అంశంపై జరిగిన పలు సర్వేలు, ఇతర వివరాలను ఐఐటీ – హైదరాబాద్‌ సేకరించింది. అయితే అప్పటి నుంచి ఈ అంశంపై పెద్దగా కదలిక కనిపించ లేదు. కాగా గోదావరి వరదలు, వాటి తాలూకు ప్రభావాలను కేంద్ర జల సంఘానికి చెందిన బృందం పినపాక, భద్రాచలం నియోజకవర్గాల పరిధిలో సోమవారం సర్వే చేపట్టింది. దీంతో మరోసారి ఐఐటీ – హైదరాబాద్‌ సర్వే అంశం తెరపైకి వచ్చింది. దీనిపై ఇంజనీరింగ్‌ అధికారులను సంప్రదించగా.. సర్వేకు అవసరమైన వివరాలను ఐఐటీ – హైదరాబాద్‌ బృందానికి అప్పగించామని, వచ్చే నెలలో క్షేత్రస్థాయి సర్వే ప్రారంభమయ్యే అవకాశముందని తెలిపారు.

వరద భయాలు..

పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై కేంద్ర జలసంఘం 2016లో సర్వే చేపట్టింది. ఈ ప్రాజెక్టును 46 మీటర్ల ఎత్తు వద్ద గేట్లు మూసి పూర్తి నీటి నిల్వ సామర్థ్యంతో నింపితే ఎంత ముంపు ఉంటుందనే అంచనాకు అధికారులు వచ్చారు. అలాగే రికార్డు స్థాయి వరద వస్తే భద్రాచలం, దుమ్ముగూడెం మండలాల్లో ప్రభావం ఎలా ఉంటుందనే అంశాలపైనా వివరాలు సేకరించారు. 1986లో భద్రాచలం వద్ద వచ్చిన గరిష్ట వరద 35 లక్షల క్యూసెక్కులు, 76 అడుగుల వరకై తే తెలంగాణలో ముంపు ఉండదని అంచనా వేశారు. కానీ 2022 జూలైలో వచ్చిన వరద ఈ అంచనాలను తారుమారు చేసింది. భద్రాచలం వద్ద 24.50 లక్షల క్యూసెక్కుల వరద, 71.60 అడుగులు నమోదు కాగా, ఈ వరదకే జిల్లాలోని 102 గ్రామాల్లో 16 వేల ఇళ్లు ముంపునకు గురయ్యాయి. అంటే 2016 నాటి సీడబ్ల్యూసీ నివేదిక అంచనాలు తప్పాయి. గోదావరి వరద ప్రవాహం కేవలం ఈ నదికే కాకుండా ఉపనది అయిన కిన్నెరసాని, దాని ఉపనదైన ముర్రేడు వాగుపై కూడా కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement