కార్మికుల ప్రాణాలకు రక్షణగా ఉండాలి.. | - | Sakshi
Sakshi News home page

కార్మికుల ప్రాణాలకు రక్షణగా ఉండాలి..

May 7 2025 12:30 AM | Updated on May 7 2025 12:30 AM

కార్మ

కార్మికుల ప్రాణాలకు రక్షణగా ఉండాలి..

సింగరేణి(కొత్తగూడెం): సంస్థ నిర్వహించే రెస్క్యూ శిక్షణలో ప్రావీణ్యం సాధించి, కార్మికుల ప్రాణాలకు రక్షణగా ఉండాలని ఏరియా జీఎం ఎం.శాలేంరాజు పేర్కొన్నారు. సోమవారం కొత్తగూడెం ఏరియా పరిధిలోని 3 ఇంక్‌లైన్‌లోని రెస్క్యూ స్టేషన్‌లో తొలిసారిగా మహిళలకు ఇస్తున్న శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ఈ శిక్షణకు ముందు బేసిక్‌ టెస్ట్‌ ఉంటుందని, అందులో ఉత్తీర్ణులైనవారికే శిక్షణ ఇస్తారని, ఒక్క ట్రెయినీ సుమారు 10 మంది ప్రాణాలను కాపాడే నైపుణ్యం సంపాదించే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్‌, ఎస్‌ఓటూ జీఎం కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి, అనంత రామయ్య తదితరులు పాల్గొన్నారు.

రేపు ఉమ్మడి జిల్లాస్థాయి చెస్‌ ఎంపికలు

ఖమ్మంస్పోర్ట్స్‌: ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ఈ నెల 8న ఉమ్మడి జిల్లాస్థాయి చెస్‌ క్రీడాకారుల ఎంపిక ఉంటుందని ఆర్గనైజర్‌ సీహెచ్‌.గోపి తెలిపారు. చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన అండర్‌ – 7, 9, 11 విభాగాల్లో బాలబాలిలకు వేర్వేరుగా పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. క్రీడాకారులు వివరాలకు 94401 62749 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

గ్రామాల్లో డీపీఓ పర్యటన

జూలూరుపాడు: మండలంలోని పలు గ్రామాల్లో జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) చంద్రమౌళి పర్యటించారు. కొమ్ముగూడెం, శంభునిగూడెం, అనంతారం,గుండెపుడి,జూలూరుపాడుల్లో జరుగుతున్న ఇంకుడుగుంతల నిర్మాణ పనులను పరిశీలించారు.త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలని పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు. వర్షాకాలంలో నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచడానికి ఇంకుడుగుంతలు ఉపయోగపడతాయన్నారు. ఎంపీఓ తులసిరామ్‌, పంచాయతీ సెక్రటరీలు ఖాదర్‌మియా, శ్రీహరి, సతీశ్‌, శైలజ, రవి పాల్గొన్నారు.

పేకాట స్థావరంపై దాడి

అశ్వారావుపేటరూరల్‌: పేకాట స్థావరంపై మంగళవారం స్థానిక పోలీసులు దాడి చేశారు. ట్రెయినీ ఎస్‌ఐ అఖిల కథనం ప్రకారం.. స్థానిక మోడల్‌కాలనీలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.2,300 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ట్రెయినీ ఎస్‌ఐ తెలిపారు.

వేధింపులకు పాల్పడిన వ్యక్తికి ఏడాది జైలు

భద్రాచలంఅర్బన్‌: ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన భద్రాచలం పట్టణానికి చెందిన లక్ష్మణ్‌కు ఏడాది జైలుశిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి శివనాయక్‌ మంగళవారం తీర్పు చెప్పారు. తనను లక్ష్మణ్‌ లైంగికంగా వేధిస్తున్నాడని 2022లో భానుమతి అనే మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. టౌన్‌ సీఐ కేసు నమోదు చేసి, కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.

రెండు బైకులు ఢీ

ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

దమ్మపేట: ఆగి ఉన్న బైకును ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనం బలంగా ఢీకొట్టిన ఘటనలో రోడ్డుపై నిలబడి ఉన్న యువకుడు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని పార్కలగండి శివారులో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని జగ్గారం సమీపంలోని గుర్వాయిగూడెంనకు చెందిన వగ్గెల వంశీ, జగ్గారం గ్రామానికి చెందిన సోయం సిద్ధార్థ, మణుగూరుకు చెందిన కొమరం చందు డ్యూక్‌ బైక్‌పై జగ్గారం నుంచి దమ్మపేటలో జరుగుతున్న ముత్యాలమ్మ జాతరకు వస్తున్నారు. అన్నపురెడ్డిపల్లి మండలం కొండాయిగూడెం గ్రామానికి చెందిన జేసీబీ డ్రైవర్‌ మిడియం దుర్గారావు, చీపురుగూడెం గ్రామానికి చెందిన బొక్కా ఉపేంద్ర (21)తో కలిసి దమ్మపేట వైపునకు బైక్‌పై వస్తున్నారు. పార్కలగండి శివారులో బైకును ఆపి రోడ్డుపై నిలబడ్డారు. మరో ఇద్దరు పల్సర్‌ బైక్‌పై వెళ్తూ ఉపేంద్రను అంబర్‌ కావాలని అడిగారు. ఉపేంద్ర వారికి అంబర్‌ ఇవ్వబోతుండగా వగ్గెల వంశీ బైక్‌ను వేగంగా నడుపుకుంటూ వచ్చి ఉపేంద్రతో పాటు ఆగి ఉన్న బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. ఉపేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా.. డ్యూక్‌ బైక్‌పై ఉన్న ముగ్గురు, పల్సర్‌పై ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను 108 ద్వారా అశ్వారావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

కార్మికుల ప్రాణాలకు  రక్షణగా ఉండాలి.. 1
1/1

కార్మికుల ప్రాణాలకు రక్షణగా ఉండాలి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement