
లైన్ క్లియరెన్స్ ఇక సులభం
● నూతన యాప్ను ప్రవేశపెట్టిన టీజీఎన్పీడీసీఎల్ ● ఉద్యోగులకు తప్పనున్న ఇబ్బందులు ● అధికారులు, ఉద్యోగులకు శిక్షణ
భద్రాచలంఅర్బన్: విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు టీజీఎన్పీడీసీఎల్ ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబిస్తోంది. ఈ క్రమంలో లైన్ క్లియరెన్స్ (ఎల్సీ) మరింత బాధ్యతగా, సులభంగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఒక్క ఫోన్ కాల్ ద్వారా ఎల్సీ తీసుకోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యుత్ ప్రమాదాలతో ప్రాణనష్టం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఎల్సీ (ఫీడర్లలో విద్యుత్ సరఫరా నిలిపివేత, పునరుద్ధరణ) తీసుకోవడానికి ప్రత్యేక యాప్ను ఎన్పీడీసీఎల్ యాజమాన్యం రూపొందించింది. ఇప్పటివరకు ఎల్సీ తీసుకుంటే.. సబ్ స్టేషన్ ఆపరేటర్కు, తీసుకున్న ఉద్యోగికి మాత్రమే తెలిసేది. ఈ యాప్ ద్వారా ఏఈ, ఏడీఈ, డీఈలు కూడా తెలుసుకునే వీలు కలగడంతోపాటు పర్యవేక్షణ పెరుగుతుంది. ఫీడర్ల ఎంపికలోనూ కచ్చితత్వం ఉంటుంది.
ఏఈ పర్యవేక్షణ..
ఈ యాప్ను ఏఈలు పర్యవేక్షిస్తారు. సిబ్బంది ఏ ఫీడర్ వద్ద పనిచేస్తున్నారో అందులో సమాచారం ఇవ్వాలి. లైన్మెన్ యాప్ను తెరిచి సంబంధిత ఫీడర్లో ఎల్సీ కావాలని ఏఈకి సమాచారం పంపాలి. దాన్ని ఏఈ పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. సమాచారాన్ని అక్కడున్న లైన్మెన్కు చేరవేస్తారు. సంబంధిత ఉప కేంద్రం ఫీడర్ ఆపరేటర్కు యాప్ ద్వారా వివరాలు వెళ్తాయి. దాన్ని పరిశీలించిన అనంతరం ఆ ఫీడర్కు సంబంధించిన లైన్ క్లియరెన్స్ (ఎల్సీ) ఇస్తారు.
సూచనలిస్తూ..
పొరపాట్లను నివారించేందుకు తగు సూచనల్ని యాప్ ఇస్తుంది. హెల్మెట్ ధరించాలని, హ్యాండ్ గ్లౌజ్ వేసుకోవాలని, ఎర్త్ రాడ్ వాడాలని, ఏబీ స్విచ్ ఓపెన్ చేశారా? లేదా అనే జాగ్రత్తలను యాప్ గుర్తు చేస్తుంది. ఎక్కడైనా డబుల్ ఫీడింగ్ ఉందా? ఈ ఫీడర్కు వేరే ఫీడర్ అనుసంధానం ఉందా? వంటి సమాచారాన్ని తెలియజేస్తుంది. దీని ద్వారా జాగ్రత్త పడుతూ ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. డబుల్ ఫీడింగ్ ఉంటే రెండు ఫీడర్లలో ఎల్సీ తీసుకోవడమా? లేదా ఇతరత్రా జాగ్రత్తలు తీసుకువచ్చా? అని బేరీజు వేసుకుని పనులు చక్కదిద్దుతారు. ఎల్సీ తీసుకున్న ఫీడర్లో పనులు పూర్తి కాగానే యాప్లో ఆ సమాచారాన్ని లైన్మెన్ పొందుపర్చి విద్యుత్ సరఫరా పునరుద్ధరించవచ్చనే సంకేతాన్ని, సమాచారాన్ని యాప్ ద్వారా చేరవేస్తారు. దీన్ని సంబంధిత సెక్షన్ ఏఈ పరిశీలించి సబ్స్టేషన్ ఆపరేటర్కు చేరవేస్తారు. దీంతో ఎల్సీ తీసుకున్న ఫీడర్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారు.
ప్రమాదాల నివారణకే..
విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించడంలో భాగంగా భద్రతా ప్రమాణాలను పెంచడానికి ప్రత్యేకంగా ఎల్సీ యాప్ను టీజీఎన్పీడీసీఎల్ యాజమాన్యం రూపొందించింది. ఎల్సీ యాప్ ద్వారా విద్యుత్ అంతరాయాల సమయాలు, మానవ తప్పిదాలను అరికట్టవచ్చు. విద్యుత్ ప్రమాదాలు, ప్రాణనష్టాన్ని నివారించవచ్చు. దీంతో భవిష్యత్లో ఎలాంటి ప్రమాదాలు జరగవు. –మహేందర్, ఎస్ఈ,
భద్రాద్రి కొత్తగూడెం

లైన్ క్లియరెన్స్ ఇక సులభం