
ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి యత్నం
చుంచుపల్లి: రామవరం రేంజ్, పెనగడప సెక్షన్ పరిధిలోని జగ్గారం గ్రామం అటవీ ప్రాంతంలో రేంజ్ ఆఫీసర్ ఎల్లయ్య, సెక్షన్ ఆఫీసర్ సలూజా, బీట్ అధికారులతో మంగళవారం ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ సరిహద్దులు పరిశీలిస్తున్న క్రమంలో అదే గ్రామానికి చెందిన గొత్తికోయలు దాడి చేసేందుకు యత్నించారు. కొందరు అటవీ సిబ్బంది తప్పించుకుని బయటపడ్డారు. ఈ ఘటనపై కొత్తగూడెం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అడవి గేదెల దాడిలో ఇద్దరికి గాయాలు
సత్తుపల్లిరూరల్: రహదారిపై వెళ్తున్న ఆటోకు అడ్డుగా వచ్చిన అడవి గేదెలు దాడి చేయటంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం పెనగడప నుంచి పలువురు కూలీలు మంగళవారం సత్తుపల్లికి బయలుదేరారు. ఈ ఆటో యాతాలకుంట వద్ద రోడ్డు దాటుతుండగా, పక్క నుంచి అడవి గేదెలు దూసుకొచ్చి ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ఉన్న పల్లపు రాజు, బోసు ఓదేలుకు గేదెల కొమ్ములు తాకడంతో తీవ్ర గాయాలు కాగా సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
బెదిరింపు ఫోన్పై కేసు నమోదు
కొత్తగూడెంటౌన్: సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న గుండా శ్రీనివాస్కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మంగళవారం కొత్తగూడెం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ కరుణాకర్ కఽథనం ప్రకారం.. తనకు తెలిసిన ఓ మహిళను సింగరేణి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ను చేయాలని, తాను మంత్రి అనుచరుడినని సింగరేణి ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్లో సెక్రటరీగా పనిచేస్తున్న గుండా శ్రీనివాస్కు గుర్తు తెలియని వ్యక్తి (రఘు) ఫోన్ చేసి బెదిరించాడు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఏసీబీ అదుపులో సింగరేణి ఉద్యోగి
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా పరిధిలోని మెయిన్ వర్క్షాపులో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్న అన్నెబోయిన రాజేశ్వరరావును మంగళవారం అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ డీఎస్సీ రమేశ్ తెలిపారు. ఇల్లెందు గెస్ట్హౌజ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ ఇన్వాలిడేషన్కు దరఖాస్తు చేసుకున్న సింగరేణి ఉద్యోగుల వివరాలు తెలుసుకొని డబ్బులు వసూలు చేశాడని, ఉద్యోగాలు పెట్టిస్తానని అమాయకులను వలలో వేసుకొని వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసినట్లు సింగరేణి విజిలెన్స్ విచారణలో తేలిందని తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు రాజేశ్వరరావును అదుపులోకి తీసుకున్నామని, ఆయన బ్యాంకు ఖాతాల్లోకి రూ.32 లక్షలు లావాదేవీలు నడిచాయని తెలిపారు. రేపు ఆయన్ను వరంగల్లోని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరుస్తామని, దీని వెనుక మరికొందరు ఉన్నట్లు తెలిసిందని, వివరాలు సేకరించి వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ వివరించారు.
ఉద్యోగి ఆత్మాహత్యాయత్నం
దుమ్ముగూడెం: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్గా పనిచేస్తున్న కృష్ణమ్మ ఎలుకలమందు తాగి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండల ప్రజా పరిషత్ అధికారులు, సిబ్బంది వేధింపులకు గురిచేస్తున్నారని, దీంతోపాటు మెమో జారీ చేయడంతో మనస్తాపం చెంది ఆత్మాహత్యాయత్నానికి పాల్పడినట్టు ఆమె తెలిపింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టు సమాచారం. కాగా ఈ ఘటనపై ఎంపీడీఓ బద్ది రామకృష్ణ వివరణ కోరగా.. కార్యాలయంలో విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో మెమో జారీ చేశామని, గతంలో కూడా పలుమార్లు మెమోలు జారీ చేశామని వాటికి సమాధానం కూడా ఇవ్వలేదని తెలిపారు.

ఫారెస్ట్ సిబ్బందిపై దాడికి యత్నం