
కేదార్నాథ్ యాత్రలో విషాదం
● అశ్వారావుపేట వాసి మృతి ● ఆలయ సమీపంలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన భక్తుడు
అశ్వారావుపేట : అశ్వారావుపేటకు చెందిన కొందరు కేదార్నాథ్ యాత్రకు వెళ్లగా అందులో ఓ భక్తుడి యాత్ర విషాదాంతమైంది. ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం కోసం అశ్వారావుపేట నుంచి ఆరుగురు భక్తులు ఈనెల 1వ తేదీన కారులో బయలుదేరారు. 11 యాత్రలు ముగించుకుని చివరిదైన కేదార్నాథ్కు సోమవారం ఉదయం చేరుకున్నారు. కింది భాగంలోని గౌరీకుంఢ్ నుంచి 8 గంటలకు కొందరు పాదయాత్ర ప్రారంభించగా మరి కొందరు గుర్రాలు, డోలీలపై వెళ్లారు. ఈ క్రమంలో పాదయాత్ర చేస్తున్న అశ్వారావుపేటకు చెందిన వ్యాపారి గుత్తికొండ వెంకటేశ్వరరావు(47).. 17 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాత్రి 9 గంటలకు ఆలయ సమీపానికి చేరుకున్నాడు. కాగా, మధ్యలో ఆయాస పడుతూనే ఉన్నాడని పక్కనున్న భక్తులు తెలిపారు. ఎట్టకేలకు యాత్ర పూర్తి చేసి క్షేత్రానికి చేరువలోకి వెళ్లాక సహచరులతో కలిసి భోజనం చేసి టెంట్ కింద పడుకున్నాడు. మంగళవారం ఉదయం 5 గంటలకు అభిషేకానికి వెళ్లేందుకు వెంకటేశ్వరరావును నిద్ర లేపేందుకు పక్కవారు ప్రయత్నించగా ఎంతకూ స్పందించకపోవడంతో సమీపంలోని వైద్యులకు చూపించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని మిలటరీ అధికారులకు తెలియజేయగా మృతదేహాన్ని హెలికాప్టర్లో గౌరీకుంఢ్కు తరలించారు. అక్కడి నుంచి రుద్ర ప్రయాగలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సాయంత్రానికి పోస్ట్మార్టం పూర్తి చేసి సహచర భక్తులకు మృతదేహాన్ని అప్పగించారు. అక్కడి నుంచి మంగళవారం రాత్రి 9 గంటలకు బయలుదేరగా.. 2వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అశ్వారావుపేటకు బుధవారం రాత్రి వరకు చేరుకోవచ్చని అంటున్నారు. వెంకటేశ్వరరావు మరణ వార్త తెలియడంతో ఇంటివద్ద భార్య, పిల్లలు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
నెరవేరని చివరి కోరిక..
ఆరుగురు భక్తులు ద్వాదశ జ్యోతిర్లింగాలలో 11 యాత్రలు ముగించుకుని చివరిది, కఠోరమైన కేదారినాథ్కు చేరుకున్నారు. కేదార్నాథ్ దర్శనం తర్వాత బద్రీనాథ్ వెళ్లాలని, అక్కడ తన తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేయాలని వెంకటేశ్వరరావు చెప్పాడని సహచరులు తెలిపారు. దీంతో పాటు తనకు కుమారులు లేనందున తాను కూడా ఆత్మ పిండ ప్రదానం చేసుకోవాలని చెప్పాడని, అయితే చివరి కోరిక నెరవేరకుండానే తుదిశ్వాస విడిచాడని విలపించారు.