వేసవి శిబిరం షురూ.. | - | Sakshi
Sakshi News home page

వేసవి శిబిరం షురూ..

May 6 2025 12:42 AM | Updated on May 6 2025 12:42 AM

వేసవి

వేసవి శిబిరం షురూ..

● 15 రోజుల పాటు విద్యార్థులకు శిక్షణ ● ఒక్కో సెంటర్‌ నిర్వహణకు రూ.50 వేలు

మణుగూరు టౌన్‌: ఇప్పటివరకు హైదరాబాద్‌తో పాటు పాత జిల్లా కేంద్రాలోన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే నిర్వహించిన యంగ్‌ ఇండియా వేసవి శిక్షణ శిబిరాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాయి. ఈ మేరకు పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, అశ్వాపురం, పినపాక, బూర్గంపాడు, ఆళ్లపల్లి మండలాల్లో మొత్తం 12 ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం శిక్షణ క్యాంప్‌లు ప్రారంభమయ్యాయి. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 15 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. కనీసం 20 మందికి పైగా హాజరయ్యే విద్యార్థుల కోసం ఒక్కో సెంటర్‌కు ప్రభుత్వం రూ.50 వేల చొప్పున కేటాయించగా శిక్షణ ఖర్చులతో పాటు విద్యార్థులకు స్నాక్స్‌ అందించాల్సి ఉంటుంది. విద్యార్థుల సంఖ్యను బట్టి వలంటీర్లను నియమించి శిక్షణ ఇప్పించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే.

ఏమేం నేర్పిస్తారంటే..?

యంగ్‌ ఇండియా సమ్మర్‌ క్యాంప్‌ల కోసం జిల్లాలో 50 పాఠశాలలను ఎంపిక చేశారు. విద్యార్థులు ప్రతిరోజూ హాజరయ్యేలా ఒక వలంటీర్‌ను ఏర్పాటు చేసి 15 పని దినాల్లో ఒక్కో రోజు ఒక్కో అంశంపై శిక్షణ ఇస్తారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు జరిగే శిక్షణలో ప్రతిరోజూ మొదటి 20 నిమిషాలు ప్రాణాయామం, ఎక్సర్‌సైజులు, తర్వాత 10 నిమిషాలు విరామం, అనంతరం గంటన్నర పాటు యాక్టివిటీలు, చివరి గంట నీతి కథలు, వాటి నుంచి విద్యార్థులు అలవర్చుకోవాల్సిన మంచి లక్షణాలపై ఆడియో, వీడియో రూపంలో శిక్షణ ఇస్తారు. ప్రధానంగా చెస్‌, యోగా, క్యారమ్స్‌, సైన్స్‌ ప్రయోగాలు, పెయింటింగ్‌, చేతిరాత మెరుగు కోసం, నృత్యాలు, మార్షల్‌ ఆర్ట్స్‌, డ్రాయింగ్‌, కాగితాల బొమ్మలు, సాధన వంటి ఆటలపై శిక్షణతో పాటు స్పోకెన్‌ ఇంగ్లిష్‌, కంప్యూటర్‌పై అవగాహన కల్పిస్తారు.

పిల్లలకు మానసికోల్లాసం

పభుత్వం ఇలాంటి అంశాలకు శ్రీకారం చుట్టడంతో ఎప్పుడూ చదువుకునే విద్యార్థులకు మానసికోల్లాసం కలుగుతుంది. వారిలో సూక్ష్మగ్రహణ శక్తి పెరుగుతుంది. చదువులో వెనుకబడిన విద్యార్థుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఆటల్లో పాటించాల్సిన మెళకువలపై అవగాహన పెంచుకోవచ్చు.

–జి.నాగశ్రీ, హెచ్‌ఎం, మణుగూరు జెడ్పీ హైస్కూల్‌

సమ్మర్‌ క్యాంపు ప్రారంభం

అశ్వాపురం: మండల పరిధిలోని మిట్టగూడెం ప్రభుత్వ పాఠశాలలో యంగ్‌ ఇండియా సమ్మర్‌ క్యాంపును ఎంపీడీఓ వరప్రసాద్‌, ఎంఈఓ వీరస్వామి సోమవారం ప్రారంభించారు. ఈ నెల 21 వరకు నిర్వహించనున్న ఈ క్యాంప్‌లో చదువు, ఆటలు, డ్రాయింగ్‌, గార్డెనింగ్‌ వర్క్‌, సీడ్‌ కలెక్షన్‌, పేపర్‌ క్రాప్ట్స్‌, కంప్యూటర్‌ స్కిల్స్‌ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామని వారు తెలిపారు.

వేసవి శిబిరం షురూ..1
1/1

వేసవి శిబిరం షురూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement