
కార్పొరేషన్ భూముల ఆక్రమణకు యత్నం
● వెదురు చెట్లను నరుకుతున్న గిరిజనులు ● అడ్డుకున్న అధికారులు.. ఇరువర్గాల మధ్య వాగ్వాదం
అశ్వారావుపేటరూరల్: ఫారెస్టు అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ)కు చెందిన భూముల్లో ఉన్న వెదురు చెట్లను కొందరు గిరిజనులు నరుకుతుండగా బుధవారం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు అడ్డుకోగా, ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన గిరిజనులకు సర్వే నంబర్లు 30, 36, 39లో 573 ఎకరాలకు సంబంధించి 150 మందికి హక్కు పత్రాలు, పాత పట్టాలు ఉన్నాయి. కాగా, 30 ఏళ్ల కిందట తమ పెద్దలను ఆ నాటి అధికారులు మోసం చేసి అన్యాయంగా తమ భూముల్లో ఎఫ్డీసీ, అటవీశాఖ ఆధ్వర్యంలో వెదురు, టేకు ప్లాంటేషన్లు వేసినట్లు గిరిజనులు కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నాలుగు రోజుల కిందటి నుంచి గ్రామస్తులంతా కలిసి వెదురు, ఇతర చెట్లను నరివేస్తున్నారు. సమాచారం అందుకున్న ఎఫ్డీసీ డీఎం రమేశ్, డీఆర్ఓ రవికుమార్, ఎఫ్ఆర్ఓ చంద్రకళ, ఫారెస్టు రేంజర్ మురళి, సిబ్బంది కలిసి ఘటనా స్థలానికి వెళ్లి గిరిజనులను అడ్డుకున్నారు. దీంతో గిరిజనులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అలాగే స్థానిక సీఐ పింగళి నాగరాజురెడ్డి, ఎస్ఐ యయాతి రాజు, ట్రైనీ ఎస్ఐ అఖిలతోపాటు సిబ్బంది వెళ్లి ఇరువర్గాలను శాంతింపజేశారు. దీంతో గిరిజనులు తమ వద్ద ఉన్న ఆధారాలతోపాటు, 2011లో ఖమ్మం జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ తమకు ఈ భూములను అప్పగించాలని రెవెన్యూ, అటవీ శాఖ అధికారులను ఆదేశించిన వివరాలను సీఐకి చూపించారు. కాగా, ఆ నాటి నుంచి అధికారులు సర్వేల పేర్లతో తమను మోసం చేయడంతోపాటు, పట్టించుకోవడం లేదని గిరిజనులు వాపోయారు. ఇరువర్గాలు ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని, అప్పటిదాకా చెట్లను ధ్వంసం చేయవద్దని సూచించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. కాగా, వెదురు చెట్లను నరికిన నలుగురు గిరిజనులపై ఎఫ్డీసీ డీఆర్ఓ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కార్పొరేషన్ భూముల ఆక్రమణకు యత్నం