
యువకుడు అదృశ్యం
పాల్వంచరూరల్: తొమ్మిది రోజుల కిందట సుతారి పనికోసం వెళ్లిన యువకుడు కనిపించకుండాపోయిన ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. మండలంలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన, సూతారి మేసీ్త్రగా పనిచేస్తున్న ధర్మసోత్ సంతోష్ గత నెల 27వ తేదీన పనిఉందని ఇంట్లో తల్లికి చెప్పివెళ్లి తిరిగి రాలేదు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో యువకుడి తల్లి హచ్చి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఏఎస్ఐ సుధాకర్ తెలిపారు.
పట్వారిగూడెంలో మహిళ..
దమ్మపేట: వివాహిత కనిపించకుండా పోయిన ఘటన మండలంలోని పట్వారిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అన్నపురెడ్డి మండలం జానకీపురం గ్రామానికి చెందిన వేముల వరలక్ష్మి తన కుమారుడితో కలిసి వేసవి సెలవులకు మండలంలోని పట్వారిగూడెంలోని పుట్టింటికి 20 రోజుల కిందట వచ్చింది. మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రలో ఉండగా, ఆమె బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. వరలక్ష్మి తండ్రి ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిశోర్రెడ్డి తెలిపారు.
మొదలుకు నిప్పు.. వాహనంపై పడిన చెట్టు
ముగ్గురికి తీవ్రగాయాలు
తిరుమలాయపాలెం: రోడ్డుపై వెళ్తున్న వాహనంపై భారీ వృక్షం పడడంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. తిరుమలాయపాలెం కొక్కిరేణి స్టేజీ సమీపాన బుధవారం జరిగిన ఈ ఘటన వివరాలు... పంటలపై నీడ పడుతోందని కొందరు రైతులు రహదారి పక్కన చెట్ల మొదళ్లకు నిప్పు పెడుతున్నారు. ఇలాగే చేయడంతో చెట్టు ఒక్కసారిగా కూలగా అదే రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనంపై పడింది. దీంతో వాహనంపై వెళ్తున్న బీసురాజుపల్లితండాకు చెందిన బోడ సేవ్యా, పద్మ, సుధాకర్కు తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఖమ్మం తరలించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు చేరకుని జేసీబీతో చెట్టును తొలగించారు.
విధులకు ఆటంకపర్చిన ఇద్దరిపై కేసు
కారేపల్లి: అటవీ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరిపై కారేపల్లి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. కారేపల్లి అటవీ రేంజ్ పరిధి గేటు రేలకాయలపల్లిలో ధర్మసోత్ సూర్యం, ఆయన కుమారుడు జేసీబీతో అటవీ భూమిలో దున్నుతున్నారు. ఈ సమాచారం అందుకున్న ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ ఇమ్మడి వీరభద్రం, బీట్ ఆఫీసర్ రమాదేవి వెళ్లి అనుమతి పత్రాలు అడగగా సూర్యం, ఆయన కుమారుడు అసభ్య పదజాలంతో దూషిస్తూ ఉద్యోగులను గెంటేశారు. దీంతో ఉద్యోగుల ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బి.గోపి తెలిపారు.
తిరంగా ర్యాలీ
మధిర: ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంపై త్రివిధ దళాలకు వందనం చెబుతూ మధిరలో బుధవారం తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదులను మట్టుబెట్టడమే కాక ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడం ద్వారా దేశ సైనికుల సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. ఈ కార్యక్రంమలో డాక్టర్ ఎ.కొండల్రావు, గల్లా సత్యనారాయణ, నెల్లూరు కోటేశ్వరరావు, ఎస్.కే.మహమ్మద్ ముజాయిదీన్ మాట్లాడగా ఏలూరి నాగేశ్వరావు, చావా వేణు, చేకూరి కృష్ణారావు, రషీద్, గాలిమ్, కురువెళ్ల కృష్ణ, చెరుగుడ్ల నర్సింమారావు పాల్గొన్నారు.