ముంచుకొస్తున్న ముప్పు.. | - | Sakshi
Sakshi News home page

ముంచుకొస్తున్న ముప్పు..

Jun 5 2025 7:28 AM | Updated on Jun 5 2025 8:22 AM

● నానాటికీ పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు ● వివిధ కారణాలతో తరుగుతున్న అడవులు ● వాతావరణ సమతుల్యతకు మరింత విఘాతం ● పర్యావరణ పరిరక్షణే మార్గమంటున్న నిపుణులు
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం

చుంచుపల్లి: మానవ మనుగడలో పర్యావరణం కీలకపాత్ర పోషిస్తుంది. అయితే కొన్నేళ్లుగా మానవ తప్పిదాలు, ఇతర కారణాలతో ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. విలువైన సహజ సంపదను కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేస్తేనే భావితరాలు సాఫీగా సాగుతాయని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. విచక్షణా రహితంగా చెట్ల నరికివేత, ప్లాస్టిక్‌ వినియోగం, పరిశ్రమల నుంచి వచ్చే విష వాయువులు, వ్యర్థాలతో భూతాపం పెరగడం, భూ, వాయు, జల కాలుష్యాలు పెరుగుతుండడం వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించాలంటే ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఇందుకోసం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తారు.

అడవుల తగ్గుదలతో ఆందోళన

అడవుల అభివృద్ధితోనే పర్యావరణ సమతుల్యతను కాపాడటం అనేది సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. పలు రకాలైన జంతు, వృక్ష జాతులకు ఆశ్రయం కల్పించి జీవవైవిధ్యాన్ని సంరక్షించేందుకు తోడ్పడతాయి. అడవులు భూసారాన్ని కాపాడమే కాకుండా నేల క్షీణతను నిరోధిస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే మానవ మనుగడకు అడవులే ఆధారం. 2021 నుంచి 2023 వరకు భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గటం ఒకింత ఆందోళన కలిగించే అంశం. ఉమ్మడి జిల్లాలో మూడేళ్ల వ్యవధిలో 121.21 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం తగ్గినట్లు ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌–2023ను గతేడాది డిసెంబర్‌లో వెల్లడించింది. 2021–23 మధ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 95.55 చ.కి.మీ. ఖమ్మం జిల్లాలో 25.76 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం తగ్గిందని నివేదికలో పేర్కొంది. 2021 కాలంలో 2,957.21 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం కలిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2023 చివరి నాటికి 2,861.66 చ.కి.మీ.కి తగ్గినట్లు తెలిపింది. ఇక ఖమ్మం జిల్లాలో 2021 కాలంలో 633.23 చ.కి.మీ. అటవీ విస్తీర్ణం ఉండగా, 2023 ముగిసే నాటికి 607.47 చ.కి.మీ.గా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం తగ్గిన జిల్లాల జాబితాలో ఆదిలాబాద్‌ (–115.50) తర్వాత భద్రాద్రి జిల్లా (–95,55) రెండో స్థానంలో నిలవగా, ఖమ్మం మూడో స్థానంలో ఉందని వివరించింది. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం, కిన్నెరసాని, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు.. తదితర ఎనిమిది అటవీ డివిజన్లలో ఒక్క కిన్నెరసాని వైల్డ్‌లైఫ్‌లో తప్ప మిగతా వాటిలో అటవీ విస్తీర్ణం తగ్గినట్లు నివేదిక పేర్కొంది. అక్రమణలు, అగ్ని ప్రమాదా అందుకు కారణమని, అగ్ని ప్రమాదాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటిస్థానంలో ఉన్నట్లు తేలింది.

విస్మరిస్తే తీరని నష్టం

రోజురోజుకూ వాతావరణంలో మార్పుల కారణంగా మానవ మనుగడ భవిష్యత్‌లో కష్టతరం కానుంది. అటు రుతువుల్లో వస్తున్న మార్పులతో రైతులకు సైతం నష్టం వాటిల్లుతోంది. ఇక వేసవి సీజన్‌లో భూగర్భజలాలు అమాంతం పడిపోతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమని గుర్తించాలి. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటే తలెత్తే పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నాం.

–బి.రవీందర్‌, ఈఈ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

పర్యావరణానికి చాలా ప్రమా దం పొంచి ఉందనేది ఇప్పటికే తెలుస్తోంది. అటవీశాఖ అన్ని చోట్ల మొక్కలు నాటే ప్రక్రియ కు శ్రీకారం చుడుతోంది. ఏటా వనమహోత్సవం పేరుతో లక్షలాది మొక్కలను నాటి సంరక్షిస్తోంది. అటు స్వచ్ఛంద సంస్థలు తమవంతు ముందుకు వచ్చి ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలి. యువతీ, యువకులు ఒక మొక్కను పెంచే బాధ్యత తీసుకొని పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి. –కిష్టాగౌడ్‌, డీఎఫ్‌ఓ, భద్రాద్రి కొత్తగూడెం

ఉమ్మడి జిల్లాలో అటవీ విస్తీర్ణం (చ.కి.మీ.ల్లో)

భద్రాద్రి జిల్లా ఖమ్మం జిల్లా

అటవీ డివిజన్లు 06 02

దట్టమైన అడవులు 637.34 42.68

మధ్యస్థాయి అడవులు 1,502.70 261.44

ఓపెన్‌ అడవులు 721.60 303.30

ముంచుకొస్తున్న ముప్పు.. 1
1/1

ముంచుకొస్తున్న ముప్పు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement