ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలంటౌన్: గిరిజన దర్బార్లో దరఖాస్తు చేసుకున్న అర్హులైన గిరిజనులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ యూనిట్ అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్లో ఆయన దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తమ పరిధిలో ఉన్నవాటిని వెంటనే పరిష్కరిస్తామని, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపిస్తామని తెలిపారు. గిరిజనులు సమర్పించిన అర్జీల్లో పోడు భూములకు పట్టాలు, భూ సమస్యలు, వ్యక్తిగత రుణాలు, వ్యవసాయ భూములకు కరెంటు మోటార్ల వంటి సమస్యలపైనే ఎక్కువగా ఉన్నాయని వివరించారు.
ఉత్పత్తులకు గుర్తింపు తెచ్చుకోవాలి..
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గిరిజన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని, కుటీర పరిశ్రమ నెలకొల్పి తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్లో గుర్తింపు తెచ్చుకోవాలని పీఓ రాహుల్ అన్నారు. దుమ్ముగూడెం మండలం అంజుబాక గ్రామానికి చెందిన శ్రీ ముత్యాలమ్మ యాష్ బ్రిక్స్ యూనిట్ సభ్యులకు రూ.5 లక్షల చెక్కును సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్న తరహా పరిశ్రమ నెలకొల్పి జీవనోపాధి పెంచుకోవడం అభినందనీయమని అన్నారు. ఇటుకల తయారీ, మార్కెటింగ్ సౌకర్యంపై యూనిట్ సభ్యులను ఆరా తీశారు. ఇటుకలు తయారీకి అవసరమైన ముడి సరుకులను సరసమైన ధరలకు కొనుగోలు చేసి, మన్నికై న ఇటుకలు తయారు చేయాలని సూచించారు.
పాఠశాలలో మరమ్మతులు పూర్తి చేయాలి..
గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల్లో అవసరమైన మరమ్మతు పనులను సకాలంలో పూర్తి చేయాలని పీఓ రాహుల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలతో పాటు గ్రంథాలయంలో జరుగుతున్న పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాఠశాలలో డైనింగ్ హాల్, గ్రంథాలయంలో పాఠకులకు రీడింగ్ రూమ్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్రాజ్, డీడీ మణెమ్మ, అధికారులు రవీంద్రనాథ్, చంద్రశేఖర్, అరుణకుమారి, రాంబాబు, ఉదయభాస్కర్, ఉదయ్కుమార్, వేణు, ఆర్. లక్ష్మీనారాయణ, అశోక్ కుమార్, హరీష్, శ్రీనివాస్, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.