
ఆపై ఇరుకు భవనాలు
అసలే అద్దె..
● ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో ఇక్కట్లు ● భవన నిర్మాణాలకు స్థల సేకరణ సమస్య ● జిల్లాలోని ఏడు ప్రాజెక్టుల్లో అదే పరిస్థితి
టేకులపల్లి: ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాలకు సొంత భవనాల్లేక అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. అవి కూడా ఇరుకుగా ఉండటంతో సమావేశాలు నిర్వహించేందుకు, సామగ్రి భద్రపరిచేందుకు గోదాం లేక సీడీపీఓలకు ఇక్కట్లు తప్పడంలేదు. జిల్లాలో మొత్తం 11 ప్రాజెక్టులు ఉండగా చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, పాల్వంచ, టేకులపల్లి, చండ్రుగొండ, దమ్మపేట ప్రాజెక్టులకూ సొంత భవనాలు లేవు. ఈ సమస్యను గత డిసెంబర్ 11న జరిగిన రివ్యూ మీటింగ్లో సీడీపీఓలు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయా మండల కేంద్రాల్లో ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో భవన నిర్మాణం కోసం 600 – 1000 గజాల స్థలం గుర్తించాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు.
2016లో టేకులపల్లి ప్రాజెక్ట్ ఏర్పాటు..
టేకులపల్లి, గుండాల, ఆళ్లపల్లి మండలాల అంగన్వాడీ కేంద్రాలు గతంలో సుదిమళ్ల ప్రాజెక్టు పరిధిలో ఉండేవి. 2016లో ఆ ప్రాజెక్టు నుంచి విడదీసి పరిపాలనా సౌలభ్యం కోసం ఐసీడీఎస్ టేకులపల్లి ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ గుండాలలో 60, ఆళ్లపల్లిలో 42, టేకులపల్లిలో 126 మొత్తం 228 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 209 టీచర్లు పనిచేస్తున్నారు. 5,074 మంది చిన్నారుల, 1,098 గర్భిణులు, బాలింతలు లబ్ధిపొందుతున్నారు. 228 కేంద్రాల్లో 88 అంగ్వాడీలకు సొంత భవనాలు ఉన్నాయి. అద్దె భవనాల్లో 50, పాఠశాలల్లో 90 కొనసాగిస్తున్నారు. అంగన్వాడీ టీచర్ల పోస్టులు 15, హెల్పర్ పోస్టులు 19 ఖాళీగా ఉన్నాయి.
భవన నిర్మాణమెప్పుడో..?
2016 నుంచి 2025 జనవరి వరకు టేకులపల్లి సెంటర్లోని అద్దె భవనంలో ప్రాజెక్ట్ కార్యాలయం కొనసాగించారు. మూడు నెలల క్రితమే టేకులపల్లి పోలీసుస్టేషన్ సమీపంలోకి మార్చారు. ఇక్కడ చాలీచాలని గదుల్లో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నెలా ప్రాజెక్టు స్థాయి, మండల స్థాయి సమావేశాలు జరుగుతుంటాయి. 228 కేంద్రాల అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ఒకేసారి కూర్చునే సౌకర్యం లేదు. మీటింగ్ హాల్, టాయిలెట్స్ లేవు. అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేయాల్సిన సామగ్రి, ప్రీస్కూల్ కిట్లు, యూనిఫామ్లు, మెడికల్ కిట్లు భద్రపరిచే గోదాం సదుపాయం కూడా లేదు. స్థలం కోసం సీడీపీఓలు అధికారుల ద్వారా ప్రయత్నిస్తున్నారు.
అద్దె భవనంలో ఇబ్బందులు
టేకులపల్లి ప్రాజెక్ట్కు సొంత భవనం లేదు. దీంతో అద్దె భవనంలో సమావేశాల నిర్వహణకు ఇబ్బందులు పడుతున్నాం. స్థలం కేటాయించాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టికి కూడా తీసుకెళ్లాం.
–కేఎం తార, టేకులపల్లి ప్రాజెక్టు సీడీపీఓ
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం
జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా, వీటిలో ఏడింటికి సొంత భవనాలు లేవు. వీటికి స్థలం గుర్తించాలని కలెక్టర్ త హసీల్దార్లను ఆదేశించారు. ఎ మ్మెల్యేలను కలిసి స్థలం కోసం ప్రయత్నిస్తున్నాం. దాతలు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
–స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమ అధికారి

ఆపై ఇరుకు భవనాలు

ఆపై ఇరుకు భవనాలు