
ధాన్యం కొనడంలేదని రైతుల నిరసన
సుజాతనగర్: సొసైటీ ఆధ్వర్యంలో సుజాతనగర్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ సోమవారం రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యాన్ని ఆరబెట్టి రోజుల తరబడి ఎదురుచూస్తున్నా కొనడం లేదని ఆరోపించారు. తరలింపునకు లారీలు రావడం లేదని, ధాన్యానికి అనుగుణంగా తూర్పారబట్టే మిషన్లను ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. టార్పాలిన్లు ఇవ్వకపోవడంతో అద్దెకు తెచ్చుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 40 కిలోల 500 గ్రాముల ధాన్యం తూకానికి బదులుగా 41 కిలోల 200 గ్రాముల తూకం వేయడం సరికాదన్నారు. దీనికి తోడు మరో 5 కిలోల ధాన్యం తారం తీస్తామని చెప్పడం ఏంటన్నారు. తరుగు పేరుతో మిల్లర్లు, వ్యవసాయాధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కాగా కొనుగోళ్లను వేగవంతం చేస్తామని సివిల్ సప్లై డీటీ చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.
ఎస్ఐకి రియల్
హీరోస్ అవార్డు
కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం టాస్క్ఫోర్ ఎస్ఐ జలకం ప్రవీణ్ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ రియల్ పోలీసు హీరోస్–2025 అవార్డును అందుకున్నారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 మందికి అవార్డులు రాగా అందులో ప్రవీణ్ కూడా ఉన్నారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు అవార్డు ఇచ్చినట్లు ఎస్ఐ తెలిపారు.
ప్రభుత్వాస్పత్రిలో ఎదురుకాళ్లతో కవలల జననం
పాల్వంచ: పాల్వంచ ప్రభుత్వాస్పత్రిలో ఎదురు కాళ్లతో కవల పిల్లలు జన్మించారు. వైద్య సిబ్బంది నార్మల్ డెలివరీ చేశారు. సోమవారం ఇంటర్నేషనల్ మిడ్ వైఫరీ దినోత్సవం రోజే క్లిష్టమైన డెలివరీ చేయడం విశేషం. మండలంలోని రేపల్లెవాడకు చెందిన గర్భిణి జూపల్లి పల్లవి రెండో కాన్పు కోసం ప్రభుత్వాస్పత్రికి రాగా వైద్యులు పరీక్షించి కవలలు పిల్లలు ఉన్నారని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సుఖ ప్రసవం కోసం కొన్ని వ్యాయామాలు చేయించి శిక్షణ ఇచ్చారు. దీంతో ఆమె వైద్య సిబ్బంది సూచనలు పాటిస్తూ వ్యాయామాలు చేసింది. సోమవారం ఆమెకు నార్మల్ డెలివరీ ద్వారా ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. తల్లి, కవలలు ఆరోగ్యంగా ఉన్నారు. కాగా ఇలాంటి ప్రసవాలకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షలు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. వైద్య సేవలందించిన డాక్టర్ అనూష, సిబ్బంది సుజాత తదితరులను కలెక్టర్ జితేష్ వి.పాటిల్, డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు, ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంప్రసాద్ అభినందించారు.
క్రైస్తవుల సమస్యలు పరిష్కరించాలి
పాల్వంచ: ప్రభుత్వం క్రైస్తవుల సమస్యలు పరిష్కరించాలని, దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీయుసీపీఏ రాష్ట్ర కార్యదర్శి గోనె సాల్మన్ కోరారు. సోమవారం అంబేద్కర్ కాలనీ మెర్సీ ప్రార్థన మందిరంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. క్రైస్తవులు ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. తొలుత పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలిపారు. పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు జయకుమార్, బిషప్ స్టీవెన్, జాన్ విల్సన్, విజయ్కుమార్, సదానందం, అనిల్, దయాకర్, యేసుదాస్, రవి తదితరులు పాల్గొన్నారు.
అక్రమ కలప స్వాధీనం
దుమ్ముగూడెం : మండలంలోని పైదిగూడెం గ్రామ శివారులో అక్రమంగా దాచి ఉంచిన కలపను సోమవారం అటవీశాఖ సిబ్బంది పట్టుకున్నారు. రూ.1,38,688 విలువైన 11 టేకు దిమ్మలను స్వాధీనం చేసుకుని రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు రేంజర్ కమల తెలిపారు.

ధాన్యం కొనడంలేదని రైతుల నిరసన

ధాన్యం కొనడంలేదని రైతుల నిరసన