
పిడుగుపాటుతో పూరిల్లు దగ్ధం
ములకలపల్లి: పిడుగుపాటుకు పూరిల్లు దగ్ధమైన సంఘటన మండలపరిధిలోని చలమన్ననగర్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పాతగుండాలపాడు జీపీలోని చలమన్ననగర్కు చెందిన పర్సిక సీతయ్య గ్రామ శివారులో ఇటీవల నూతనంగా పూరిల్లు నిర్మించుకున్నాడు. ఆదివారం ఉరుములు మెరుపులతో వర్షం కురిసిన సమయాన అతడి పూరిల్లుపై పిడుగు పడి పూర్తిగా దగ్ధమైంది. మరో రెండు రోజుల్లో ఇంట్లోకి వెళ్లే తరుణాన ఇలా అగ్నికి ఆహుతైందని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరాడు.
మణుగూరులో రెండు ఇళ్లల్లో చోరీ..
● రూ.1.30లక్షల నగదు, తులం బంగారంతో ఉడాయింపు
మణుగూరు టౌన్: పట్టణంలో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లల్లో బియ్యం, బంగారం, డబ్బు చోరీ చేసిన సంఘటన ఆదివారం ఉదయం సుందరయ్యనగర్లో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. సుందరయ్యనగర్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఎస్కె.హసీనా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుండగా.. శనివారం రాత్రి డ్యూటీకి వెళ్లి ఇంటికి వచ్చే సరికి తాళం పగలగొట్టి ఉంది. దీంతో లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలోని రూ.1.30లక్షల నగదు, తులం బంగారం, 20 తులాల వెండితో పాటు కింటా బియ్యం, 10 చీరలు చోరీకి గురైనట్లు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అదేవిధంగా హసీనా ఇంటికి రెండు ఇళ్ల పక్కనే ఉన్న గణేశ్ కుటుంబంతో కలిసి శనివారం సాయంత్రం అశ్వాపురం మండలానికి వెళ్లి ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. దీంతో ఇంట్లోని బీరువాలో ఉన్న వెండి సామగ్రి, పిల్లల దుస్తులు, బొమ్మలు దోచుకెళ్లినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు సంఘటనా స్థలాలను ఏడూళ్లబయ్యారం సీఐ, మణుగూరు ఇన్చార్జ్ సీఐ వెంకటేశ్వరరావు, మణుగూరు ఎస్ఐ రంజిత్లు సందర్శించి క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టి.. జాగిలాలతో గాలింపు చేపట్టారు.