ఇద్దరిపై పిచ్చి కుక్క దాడి | - | Sakshi
Sakshi News home page

ఇద్దరిపై పిచ్చి కుక్క దాడి

May 4 2025 6:48 AM | Updated on May 4 2025 6:48 AM

ఇద్దరిపై పిచ్చి కుక్క దాడి

ఇద్దరిపై పిచ్చి కుక్క దాడి

కరకగూడెం: పిచ్చి కుక్క దాడిలో ఇద్దరు గాయపడ్డారు. మండలంలోని మొగిలితోగు గ్రామానికి చెందిన కోరం పొట్టయ్య శనివారం ఉపాధి హామీ పనులకు వెళ్తుండగా పిచ్చి కుక్క దాడి చేసి గాయపర్చింది. బాధితుడు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాటిగూడెం గ్రామంలో గాంధర్ల నరసయ్య అనే వ్యక్తి ఇంట్లో పడుకుని ఉండగా పిచ్చి కుక్క దాడి చేసి ముఖం, చేతులు, కాళ్లపై తీవ్రంగా గాయపరిచింది. గ్రామస్తులు అతడిని 108లో కరకగూడెం పీహెచ్‌సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు.

కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

అశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు ఎస్సీ కాలనీ సరవయ్య గుంపులో బాలుడు కదురు జశ్వంత్‌ శనివారం కుక్కల దాడిలో గాయపడ్డాడు. బా లుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్కలు కరిశాయి. బాలుడిని తల్లిదండ్రులు భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వరి పంట దగ్ధం

కరకగూడెం: మండలంలోని రాయనిపేట గ్రామానికి చెందిన కాలం సాంబశివరావు వరి పంట శనివారం మంటలు చెలరేగి దగ్ధమైంది. పక్క పొలం రైతు వరి గడ్డి కాల్చి వేస్తుండగా మంటలు వ్యాపించి పంట దగ్ధమైనట్లు తెలుస్తోంది. గ్రామస్తుల సమాచారంతో పినపాక నుంచి ఫైరింజన్‌తో వచ్చిన స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ వినోద్‌ కుమార్‌, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. సుమారు రూ.50 వేల వరకు పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

దమ్మపేట: మినీ వ్యాన్‌ను బైక్‌ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని మందలపల్లి రహదారిపై శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం...సిద్దిపేటకు చెందిన బాణోత్‌ గణేష్‌(23)తన మిత్రుడితో కలిసి బైక్‌పై స్వగ్రామం నుంచి ఏపీలోని జంగారెడ్డిగూడెం వచ్చాడు. శనివారం తిరిగి వెళ్తుండగా మందలపల్లి వద్ద మినీ వ్యాన్‌, బైక్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గణేష్‌, అతడి మిత్రుడికి తీవ్ర గాయాలు కాగా అంబులెన్స్‌లో సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గణేష్‌ మృతి చెందాడు.

గాయపడిన వ్యక్తి మృతి

పాల్వంచ: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని యానంబైల్‌ గ్రామానికి చెందిన బల్లే శివ (35) పాల్వంచలోని నటరాజ్‌ సెంటర్‌ వద్ద గల ఓ బార్‌ షాపులో పనిచేస్తున్నాడు. గత నెల 12న రాత్రి విధులు ముగించుకుని అల్లే నరసింహారావు బైక్‌పై ఇంటికి బయలు దేరాడు. కాగా కేఎస్‌పీ రోడ్‌లో ఇండివెల్‌ కంపెనీ క్వార్టర్స్‌ వద్ద ఎదురుగా వస్తున్న గేదెలను ఢీకొట్టారు. దీంతో కిందపడటంతో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శివ పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులకు ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తమ్ముడు సర్వేష్‌ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రాఘవయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మద్యానికి బానిసై ఆత్మహత్య

దుమ్ముగూడెం: మద్యానికి బానిసై ఓ వ్యక్తి పురుగుల మందు తాగి శుక్రవారం రాత్రి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఆంధ్ర కేసరి నగర్‌ గ్రామానికి చెందిన గుర్రం రాము (44)మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడుతుండేవాడు. శుక్రవారం మధ్యాహ్నం అతిగా మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. మళ్లీ మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్యను అడుగగా, ఆమె లేవని చెప్పింది. దీంతో ఆమెను కొట్టి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. సాయంత్రం వరకు కూడా ఇంటికి రాకపోవడంతో కుమారుడు వెతకగా గ్రామ శివారులో గోదావరి నది ఒడ్డున పురుగుల మందు తాగి పడిపోయి ఉన్నాడు. దీంతో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయాడు. మృతుడి భార్య గుర్రం లక్ష్మి ఫిర్యాదు మేరకు సీఐ అశోక్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రూ.6 కోట్లకు ఐపీ దాఖలు

ఖమ్మంలీగల్‌: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన మషాట్టి నాగేశ్వరరావు రూ.6,37,21,858కు గాను దివాలా పిటిషన్‌ (ఐపీ) దాఖలు చేశాడు. మహబూబాబాద్‌తో పాటు ఖమ్మం జిల్లా పరిధిలో ధాన్యం వ్యాపారం చేసిన ఆయన పలువురి వద్ద అప్పులు తీసుకున్నాడు. ప్రస్తుతం తనకు వ్యాపారంలో నష్టం వచ్చి అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురైందంటూ తన న్యాయవాది ఎం.జె.ప్రవీణ్‌ కుమార్‌ ద్వారా ఖమ్మం సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో శనివారం దివాలా పిటిషన్‌ దాఖలు చేశాడు. కాగా, పిటీషన్‌లో 30 మందిని ప్రతివాదులుగా చేర్చాడు.

మైనర్‌ డ్రైవర్ల

తల్లిదండ్రులకు జరిమానా

ఖమ్మంక్రైం: ఏడుగురు మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులకు రూ.వేయి జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించిందని ట్రాఫిక్‌ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. ఇటీవల ఖమ్మంలో చేపట్టిన తనిఖీల్లో వాహనాలు నడుపుతూ ఏడుగురు మైనర్లు పట్టుబడగా, వారి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చామని పేర్కొన్నారు. ఈ మేరకు వారికి జరిమానా విధిస్తూ ఖమ్మం నాలుగో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ (స్పెషల్‌ మొబైల్‌) కోర్టు న్యాయమూర్తి బి.నాగలక్ష్మి శనివారం తీర్పు చెప్పారన్నారు. అలాగే, మద్యం తాగి వాహనం నడిపిన మరో వ్యక్తికి రూ.2,500 జరిమానా విధించారని ఏసీపీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement