
‘చేయూత’పై ఆశలు!
● రెండేళ్లుగా పింఛన్ కోసం పలువురి ఎదురుచూపులు ● ప్రజాపాలనలో భారీగా వచ్చిన అర్జీలు ● త్వరలోనే దరఖాస్తులకు మోక్షం
చుంచుపల్లి : కొత్తగా చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసిన వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. పింఛన్ల కోసం పలువురు రెండేళ్లుగా నిరీక్షిస్తుండగా వారందరికీ త్వరలో పెన్షన్ అందనుంది. నూతన పింఛన్ల మంజూరుకు అర్హులను గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలో అర్హులను గుర్తించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో వేల సంఖ్యలో కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు సమర్పించి ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కొన్ని పెండింగ్లో ఉండగా, కొత్త ప్రభుత్వం వచ్చాక నిర్వహించిన ప్రజాపాలన సభల్లో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో వార్డు అధికారులు అర్హుల జాబితాలు సిద్ధం చేయనున్నారు. ఆసరా పింఛన్ అర్హత వయసును గత బీఆర్ఎస్ ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించిన విషయం తెలిసిందే. దాని ప్రకారం జిల్లాలో అర్హులైనవారి నుంచి 2021 ఆగస్టు వరకు దరఖాస్తులు స్వీకరించి 2022 ఆగస్టులో కొత్త పెన్షన్లు మంజూరు చేసింది. అయితే అప్పట్లో కొత్త పింఛన్ల మంజూరులో కొంత గందరగోళం ఏర్పడి కొన్ని దరఖాస్తులు తిరస్కరించారు. మరికొందరు సకాలంలో దరఖాస్తులు సమర్పించలేక అవకాశం కోల్పోయా రు. ఆ తర్వాత మరి కొందరు గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్ల కోసం పంచాయతీ, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా, మరికొందరు మీ –సేవా కేంద్రాలతో పాటు ప్రతి సోమవారం కలెక్టరేట్లోని ప్రజావాణికి వెళ్లి ఫిర్యాధులు అందజేస్తున్నారు.
కొత్తగా 69,136 దరఖాస్తులు..
రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకంలో భాగంగా ప్రతీ నెల దివ్యాంగులకు రూ.4,016, వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళలు, చేనేత, బీడీ కార్మికులు, బోదకాలు, ఎయిడ్స్, డయాలసిస్ బాధితులకు రూ.2,016 చొప్పున అందజేస్తోంది. దీంతో జిల్లాలో అర్హులైన కొందరు కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుని మంజూరు కోసం ఎదురు చూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2021 అక్టోబర్లో కొత్త వారి నుంచి దరఖాస్తులు స్వీకరించగా, జిల్లా వ్యాప్తంగా 33,663 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 26,351 మందికి 2022 ఆగస్టులో కొత్త పింఛన్లను మంజూరు చేశారు. ఇక కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో మళ్లీ దరఖాస్తులు స్వీకరించగా 57 ఏళ్లు దాటిన వారంతా అప్లికేషన్లు పెట్టుకున్నారు. వీరే కాకుండా దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువు, చేనేత, బీడీ కార్మికులు, బోదకాలు, ఎయిడ్స్, డయాలసిస్ వ్యాధి గ్రస్తులు.. మొత్తం 69,136 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు కోసం అర్హులను గుర్తించే ప్రక్రియను చేపట్టాలని సూచించడంతో అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 1,16,290 మంది చేయూత లబ్ధిదారులు ఉన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ. 26.23 కోట్లు పింఛన్ల రూపంలో అందజేస్తోంది.
దరఖాస్తుల ఆధారంగా అర్హులను గుర్తిస్తాం
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించాలని సూచించింది. జిల్లాలో వివిధ రకాల పింఛన్లకు ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆత్యంత పారదర్శకంగా వ్యవహరించి అర్హులను ఎంపిక చేస్తాం.
– ఎం.విద్యాచందన, డీఆర్డీఓ
జిల్లాలో చేయూత పెన్షన్ల వివరాలిలా..
వృద్దులు 44,761 ఏఆర్టీ బాధితులు 1,170
దివ్యాంగులు 13,375 ఫైలేరియా బాధితులు 170
వితంతువులు 50,319 డయాలసిస్ వ్యాధిగ్రస్తులు 111
ఒంటరి మహిళలు 6,218 గీత కార్మికులు 145
చేనేత కార్మికులు 17 మంది బీడీ కార్మికులు 04

‘చేయూత’పై ఆశలు!

‘చేయూత’పై ఆశలు!