
ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టాలి
బూర్గంపాడు: ప్రతీ నీటి బొట్టును ఒడిసి పట్టాలని, అందుకోసం ప్రతి కార్యాలయం, ఇళ్లలో ఇంకుడు గుంతలు నిర్మించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బూర్గంపాడు మైనారిటీ గురుకుల పాఠశాలలో ఇంకుడుగుంతల నిర్మాణానికి శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. పలుగు, పార పట్టి ఇంకుడుగుంత తవ్వారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంకుడు గుంతల నిర్మాణానికి వేసవికాలమే సరైన సమయమన్నారు. మీటర్ వెడల్పు, మీటర్ పొడవు, మీటర్ లోతు గొయ్యి తీసి అందులో శిథిలాల వ్యర్థాలు, చిన్న రాళ్లు నింపితే ఇంకుడు గుంత నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. పాఠశాలలో మౌలిక వసతులపై ఆరా తీసిన కలెక్టర్.. డార్మెటరీ హాల్, రెండు తరగతి గదుల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని సీపీఓ సంజీవరావును ఆదేశించారు. పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం మోరంపల్లి బంజర పీహెచ్సీ, నాగినేనిప్రోలు జెడ్పీఎస్ఎస్, అంగన్వాడీ కేంద్రంలో ఇంకుడుగుంతల పనులను ప్రారంభించారు. నాగినేనిప్రోలులో నర్సరీని, లక్ష్మీపురంలో మునగతోటను పరిశీలించారు. సారపాకలో యూనిఫామ్ తయారీ కేంద్రాన్ని పరిశీలించి ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు.
సమ్మర్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలి
కొత్తగూడెంఅర్బన్: సమ్మర్ క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. క్యాంప్ పోస్టర్లను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు 100 మంది కేజీబీవీ విద్యార్థినులకు భద్రాచలంలో క్యాంప్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మ్యూజిక్, పెయింటింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, స్పోర్ట్స్, కంప్యూటర్ స్కిల్స్, ఫైన్ ఆర్ట్స్, స్పీడ్ మాథ్స్ వంటి అంశాల్లో తర్ఫీదు ఇస్తారని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, బూర్గంపాడు తహసీల్దార్ ముజాహిద్, ఎంపీడీఓ జమలారెడ్డి, ఎంపీఓ బాలయ్య, అధికారులు జె.అన్నామణి, ఎన్.సతీష్ కుమార్, ఎస్కే. సైదులు పాల్గొన్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
సూపర్బజార్(కొత్తగూడెం): అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఎండలతో వడదెబ్బ, ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నిలిపి ఉన్న వాహనాల్లో పిల్లలు, పెంపుడు జంతువులను ఉంచొద్దని, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు వంట చేయకుండా ఉండాలని, ఆల్కహాల్, టీ, కాఫీ, స్వీట్లు, శీతల పానీయాలు తీసుకోవద్దని వివరించారు. ఎండలో పనిచేసే వారు తరచుగా నీటితో పాటు ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలని సూచించారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్