
రోడ్లు, పార్కులే అడ్డా..
● మందుబాబుల చిందులు.. ఇబ్బందుల్లో ప్రజలు ● రాకపోకలకు ఇబ్బంది పడుతున్న మహిళలు, యువతులు ● పోలీస్ పెట్రోలింగ్ పెంచాలనంటున్న పట్టణ వాసులు
కొత్తగూడెంఅర్బన్ : కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో వైన్షాపులు ఉండడంతో ఆ రోడ్డు వెంట వెళ్లే మహిళలు, యువతులు, అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి అయితే మరొకరి సాయం లేకుండా ఆ వీధుల్లో వెళ్లే పరిస్థితి లేదు. కొత్తగూడెంలో బహిరంగ మద్యపానంపై శనివారం రాత్రి ‘సాక్షి’ విజిట్ చేయగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వెలుగుచూశాయి. కొత్తగూడెం సూపర్బజార్ సెంటర్ ట్రీంబాక్స్ రోడ్డు, ఆర్టీసీ బస్టాండ్ ఎదురు రోడ్డు, బాబుక్యాంపు రోడ్ల వెంటే వైన్షాపులు ఉన్నాయి. రామవరంలో కూడా రెండు మద్యం షాపులు రోడ్డు వెంటే ఉన్నాయి. ఆయా వీధుల్లో మద్యం సేవించే వారు గుంపులుగా గుమిగూడడంతో అటువైపు వెళ్లే సాధారణ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మందుబాబులో రోడ్డుపైనే మూత్ర విసర్జన చేస్తుండడంతో అటుగా మహిళలు, యువతులు వెళ్లలేకపోతున్నారు. ఇక రాజీవ్ పార్కు లోపల, బయట రాత్రి 9 నుంచి అర్ధరాత్రి వరకూ పలువురు మద్యం సేవిస్తూనే ఉన్నారు. అంతేకాక వీధుల్లో బైక్ స్వారీలు, హారన్ల మోతతో స్థానికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రగతినగర్, గొల్లగూడెం, బూడిదగడ్డ, సింగరేణి ప్రధాన ఆస్పత్రి ఏరియా, గాజులరాజంబస్తీ, హనుమాన్బస్తీ వంటి ఏరియాలలో రాత్రి 10 గంటల వరకు కూడా ప్రధాన రోడ్డుపైనే మద్యం సేవిస్తూ ఆ మత్తులో ఇతరులను ఇబ్బంది పెడుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్ పెంచాలని, మందుబాబుల ఆగడాలను అరికట్టాలని పట్టణ వాసులు కోరుతున్నారు.

రోడ్లు, పార్కులే అడ్డా..