
స్వర్ణ కవచధారణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణ కవచధారులై దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విష్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు గావించారు.
భద్రగిరిలో వైశాఖ మాసోత్సవాలు
ప్రారంభం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో వైశాఖ మాసోత్సవాలు శుక్రవారం నుంచి వైభంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 2 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఎల్.రమాదేవి తెలిపారు. రోజూ స్వామివారి మూలమూర్తులకు ప్రత్యేక అభిషేకం, స్నపన తిరుమంజనం, సంధ్యా హారతి, పవళింపు సేవ, చుట్టుసేవతోపాటు తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు, తిరువీధి సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
పెద్దమ్మతల్లికి
పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
ఆయిల్పామ్ ధర తగ్గుముఖం
తాజాగా టన్నుకు రూ.942 తగ్గుదల
అశ్వారావుపేటరూరల్: ఆయిల్పామ్ టన్ను ధర తగ్గుముఖం పడుతోంది. తాజాగా టన్నుకు ఏకంగా రూ.942 తగ్గింది. గతేడాది డిసెంబర్లో టన్ను ఆయిల్పామ్ ధర రూ.20,506 ఉండగా, ఈ ఏడాది జనవరిలో టన్నుకు రూ.19 తగ్గింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో స్వల్పంగా పెరిగి టన్ను ధర రూ.21 వేలకు చేరింది. ఒక్కసారిగా రూ.942 తగ్గిపోవడంతో టన్ను ధర రూ.20,058గా ఖరారైంది. తాజాగా నిర్ణయించిన టన్ను ధర ఏప్రిల్ నెలకు వర్తిస్తుందని ఆయిల్ఫెడ్ అధికారులు చెబుతున్నారు. కాగా, ఆయిల్పామ్ టన్ను ధర క్రమంగా తగ్గుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
అంగన్వాడీల్లో
టేక్ హోం రేషన్
వేసవి సెలవుల్లో 25 రోజులకు
కలిపి పంపిణీ
కొత్తగూడెంటౌన్: అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించడంతో టీచర్లు, ఆయాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రీ స్కూల్ కొనసాగుతున్న 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలున్న అంగన్వాడీ సెంటర్లకు పూర్తిగా సెలవులు ఇస్తున్నట్లు గురువారం తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ ఉన్నతాఽధికారులు ఉత్తర్వులను జారీ చేసిన విషయం విదితమే. సెలవులు కావడంతో మే 1 నుంచి 31 వరకు తల్లులు, పిల్లలు రాకుండా వారికి 25 రోజులకు కావాల్సిన రేషన్ను ఒక్కసారి అందజేయాలని సీ్త్ర, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలింతలు, గర్భిణులు, 6 నెలల నుంచి 5 ఏళ్ల లోపు చిన్నారులకు సరుకులను టేక్ హోం రేషన్ ద్వారా అందజేస్తామని జిల్లా సంక్షేమశాఖ అధికారిణి స్వర్ణలతా లెనినా పేర్కొన్నారు.

స్వర్ణ కవచధారణలో రామయ్య