
రూట్ మార్చి..
డిజిటల్ మార్గాన లంచాల వసూళ్లు
● మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ వ్యక్తులు.. ● ఏసీబీ దాడులతో పంథా మార్చిన అవినీతి అధికారులు ● 16 నెలల్లో 18 కేసులు, 26 మంది అరెస్ట్
కొత్తగూడెంటౌన్: లంచం అడగటం కాదు ఇవ్వటం కూడా నేరం అనేది అందరికీ తెలిసిందే. కానీ, లంచం లేకుండా పనులు అవుతున్నాయా? అంటే కావట్లేదనేది కూడా బహిరంగ రహస్యమే. ఏసీబీ దాడులు లంచగొండులను భయపెడుతున్నా.. రూటు మార్చుకుని లంచం వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని ఫోన్పే, గూగుల్పే ద్వారా లంచం తీసుకుంటున్నారు. కాగా, జిల్లాలో 2024 నుంచి 2025 ఏప్రిల్ వరకు 18 కేసులు నమోదు కాగా 26 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.12,12,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఏసీబీ దాడులు ఎక్కువవడంతో ఏసీబీ డీఏస్పీ రమేశ్ను మార్చాలని ఒత్తిళ్లు కూడా రావడం గమనార్హం.
ప్రైవేట్ వ్యక్తుల హవా..
ఇటీవల మణుగూరుటౌన్లో ఓ భూవివాదంలో సీఐ సోమ సతీశ్తో పాటు ప్రైవేట్ వ్యక్తి గోపి (ఒక చానల్ రిపోర్టర్, సాక్షి కాదు)లు లంచం తీసుకుంటూ దొరికారు. కేసు కాకుండా ఉండేందుకు అప్పటికే రూ.3 లక్షలు తీసుకుని, మరో లక్ష తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. గత మార్చి 19న బూర్గంపాడు మండలం లక్ష్మీపురం నుంచి గ్రావెల్ లారీ భద్రాచలం వచ్చింది. యజమానిని పిలిచి అనుమతులు లేవని కేసు నమోదు చేస్తామని సీఐ బెదిరించారు. మధ్యవర్తులు గన్మెన్ రామారావు, కార్తీక్లు యజమానికి చెప్పి గన్మెన్ సూచించిన ఫోన్ ఫోన్పే నంబర్కు రూ.20 వేలు పంపించారు. భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ బర్పాటి రమేశ్, గన్మెన్ (కానిస్టేబుల్ ) రామారావుతో పాటు ప్రైవేట్ వ్యక్తి కార్తీక్ను పోలీసులు పట్టుకున్నారు. 2024, ఏప్రిల్ 18న దొంగతనం కేసులో నిందితుల నుంచి లంచం తీసుకుంటూ అప్పటి భద్రాచలం ఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇలా మధ్యవర్తుల్లాగా ప్రైవేట్ వ్యక్తులు వ్యవహరిస్తూ దొరికిపోతున్నారు.
లంచం అడిగితే పట్టుకుంటాం
లంచం అడిగితే ప్రజలు భయపడటం లేదు. ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ప్రజల్లో చైతన్యం పెరిగింది. లంచం ముట్టుకుంటే మేము పట్టుకుంటాం. ఎవరు లంచం అడిగినా ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలి. ఫిర్యాదు దారుల వివరాలను గోప్యంగా ఉంచుతాం. మరింతగా అవగాహన కల్పించేందుకు పోస్టర్లను ఏర్పాటు చేశాం.
–వై.రమేశ్, ఏసీబీ డీఎస్పీ, ఖమ్మం

రూట్ మార్చి..

రూట్ మార్చి..