
‘నీట్’కు పటిష్ట బందోబస్తు
● జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలు.. 1,176 మంది అభ్యర్థులు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్
కొత్తగూడెంటౌన్: జిల్లాలో మూడు కేంద్రాల్లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరగనున్న నీట్ పరీక్షలకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రోహిత్రాజు అన్నారు. తన కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నీట్ పరీక్షా కేంద్రాలు కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కళాశాల, పాల్వంచలోని టీజీఎస్డబ్ల్యూఆర్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ (గర్ల్స్), యూనివర్శిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ వద్ద బీఎన్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉంటుందని, సీసీ కెమెరాల నిఘా ఉంటుందని వివరించారు. కొత్తగూడెం బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రధా న కూడళ్లలో పరీక్షా కేంద్రాల మార్గాలను తెలిపే క్యూఆర్ కోడ్లు అంటించామని, తాగునీటి, అత్యవసర వైద్య సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.
ఇవీ నిబంధనలు
అడ్మిట్ కార్డులో సూచించిన నియమ నిబంధనలు పాటించాలి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకే అభ్యర్థులను కేంద్రాలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆభరణాలు, షూస్, సాక్స్, బెల్డ్లు (చెవి దిద్దులు, క్లిప్లు, ఇతర ఆభరణాలు, తాయత్తులు, తాళ్లు) వంటివి లేకుండా పరీక్షా కేంద్రానికి హాజరుకావాలి. అడ్మిట్కార్డుతోపాటు గుర్తింపు కార్డు, రెండు పాస్ పోర్టు సైజ్ ఫొటోలు తమ వెంట తెచ్చుకోవాలి. పరీక్షా కేంద్రాల నుంచి 200 మీటర్ల దూరం వరకు ఎవరూ ఉండొద్దు. కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్, కంప్యూటర్ సెంటర్లు మూసివేయాలి. అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకుంటారు.