
హెచ్ఎంకు పురస్కారం
ములకలపల్లి: మండలంలోని తిమ్మంపేట ప్రాథమికోన్నత పాఠశాల హెచ్ఎం శంకర్కు యంగ్ ఇండియన్ సేవా పురస్కారం లభించింది. కొత్తగూడెంనకు చెందిన యంగ్ ఇండియన్ బ్లడ్డోనర్ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదానం, హరితహారం, విద్యాభివృద్ధి, మహిళా సాధికారత, బాల్య వివాహాల నిర్మూలన అంశాల్లో సేవలందిన వ్యక్తులకు ఏటా సేవా పురస్కారాలను అందజేస్తున్నారు. అందులో భాగంగా చిన్నారుల విద్యాభివృద్ధి, దాతల సాయంతో పాఠశాలలో మౌలిన వసతుల కల్పన, 100% విద్యార్థుల నమోదు అంశాలతోపాటు, పాల్వంచకు చెందిన వేచన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించిన సామాజిక సేవకుగాను శంకర్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. గురువారం రాత్రి హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో జలమండలి శాఖ (హెచ్ఎండబ్ల్యూఎస్), మేనేజింగ్ డైరెక్టర్ అశోక్రెడ్డి, కొల్లి ఫౌండేషన్ చైర్పర్సన్ కల్పనాచౌదరి చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.
అందరూ కలిసిమెలిసి జీవించాలి
కొత్తగూడెంఅర్బన్: సమాజంలో అందరూ కలిసిమెలిసి జీవించాలని జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖాలీద్ ముబష్షీర్ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం మదురబస్తీలోని జమాతే ఇస్లామి హింద్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వమానవ సౌభ్రాతృత్వం సమానత్వం కోసం కులమతాలకు అతీతంగా, ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా అందరికీ సమన్యాయం అందేలా కార్యకర్తలు న్యాయ ధ్వజ వాహకులుగా నిలవాలని కోరారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్ మజీద్ షోహేబ్ మాట్లాడుతూ.. జమాతే ఇస్లామి హింద్ ఒక స్వచ్ఛంద ధార్మిక సేవాసంస్థ అని, 75 ఏళ్ల నుంచి కుల, మత, వర్గ, వర్ణ వివక్ష లేకుండా సేవ చేస్తోందన్నారు. కార్యక్రమంలో జమైతే ఇస్లామిక్ హింద్ కార్యదర్శి నయీముద్దీన్, జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్యజ్దానీ, షరీఫ్, జహంగీర్, అబ్దుల్ భాసిత్, షబ్బీర్ హుస్సేన్, ముజాహిద్, పర్వీన్ సుల్తానా, షేహనాజ్, ఏజాజ్, నష్రా తదితరులు పాల్గొన్నారు.
సాఫ్ట్బాల్ సౌత్జోన్ జట్టులో జిల్లావాసులు
ఇల్లెందురూరల్: సాఫ్ట్బాల్ ఆలిండియా యూనివర్సిటీస్థాయి పోటీల్లో పాల్గొనే సౌత్జోన్ జట్టుకు జిల్లా నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు. మండలంలో మస్సివాగు గ్రామపంచాయతీకి చెందిన అజ్మీర చరణ్, దుమ్ముగూడెం మండలం రామచంద్రునిపేట గ్రామానికి చెందిన రేసు అవినాష్, గుండాల మండలం సజ్జలబోడు గ్రామానికి చెందిన జబ్బ అనిల్కుమార్ కాకతీయ యూనివర్సిటీలో బీపీఈడీ ఫైనలియర్ చదువుతున్నారు. 2024 అక్టోబర్ 20వ తేదీన కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన సాఫ్ట్బాల్ పోటీల్లో పాల్గొని, సౌత్జోన్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఏపీలోని నెల్లూరులో నిర్వహిస్తున్న పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు కోచ్ రామాంజనేయులు తెలిపారు.
క్షుద్ర పూజల కలకలం
పినపాక: మండలంలోని ఉప్పాక గ్రామంలో శుక్రవారం క్షుద్ర పూజలు కలకలం రేపాయి. పుప్పాక గ్రామంలోని పొలంలో పూజలు చేసినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైతు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలాన్ని ఎస్ఐ రాజ్కుమార్ పరిశీలించారు. క్షుద్ర పూజలు వంటి వదంతులు, మూఢ విశ్వాసాలను ఎవరూ నమ్మొద్దని సూచించారు.
నాటుసారా పట్టివేత
భద్రాచలంటౌన్: భద్రాచలం ఎకై ్సజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న నాటుసారాను పట్టుకున్నారు. ఎకై ్సజ్ అధికారుల కథనం ప్రకారం.. పట్టణంలోని కూనవరం రోడ్డులో శుక్రవారం ఎకై ్సజ్ అధికారులకు ఆటోలో తరలిస్తున్న 15 లీటర్ల నాటుసారా పట్టుబడింది. దానిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి, ఆటోను సీజ్ చేశామని అధికారులు తెలిపారు.

హెచ్ఎంకు పురస్కారం

హెచ్ఎంకు పురస్కారం

హెచ్ఎంకు పురస్కారం