
ఎదురెదురుగా రెండు కార్లు ఢీ..
● ఒకరు మృతి.. ఏడుగురికి గాయాలు ● క్షతగాత్రుల్లో దక్షిణ కొరియా దేశస్తులు
జూలూరుపాడు: మండలంలోని వినోభానగర్ సమీపంలో తల్లాడ – కొత్తగూడెం ప్రధాన రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా ఏడుగురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి కారులో దక్షిణ కొరియా దేశస్తులు ముగ్గురు, హైదరాబాద్కు చెందిన వ్యక్తి, డ్రైవర్తో (ఐదుగురు) బయలుదేరి భద్రాచలం వెళ్తున్నారు. ఆళ్లపల్లి మండలం రామాంజిగూడెంనకు చెందిన వానపాకుల సాంబశివరావు (24), భార్య సంధ్య, మరదలు శ్రీలత ఏపీ రాష్ట్రం కుక్కునూరు మండలం వెలేరుకు పెళ్లికి వెళ్లి తిరిగి కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. సాంబశివరావు హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వినోభానగర్ గ్రామం దాటిన తరువాత ఈ రెందు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. వానపాకుల సాంబశివరావు తీవ్రంగా గాయపడగా.. సంధ్య, శ్రీలతకు గాయాలయ్యాయి. దక్షిణ కొరియా పర్యాటకులు సంకిమ్, థసిన్, సైకిమ్, హైదరాబాద్కు చెందిన సాల్మన్ రాజు, డ్రైవర్ దర్శికుమార్లకూ గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, క్షతగాత్రులను 108 ద్వారా కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాంబశివరావు మృతి చెందాడు. మెరుగైన వైద్యం కోసం దక్షిణ కొరియా పర్యాటకులను ఖమ్మం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాదావత్ రవి పేర్కొన్నారు.

ఎదురెదురుగా రెండు కార్లు ఢీ..