
విజిలెన్స్ !
పత్తి కొనుగోళ్లపై
బూర్గంపాడు: సీసీఐ పత్తి కొనుగోళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీనిపై గతంలోనే ప్రాథమిక విచారణ చేసి పది మందికి పైగా మార్కెట్ కార్యదర్శులు, డీఎంఓలను సస్పెండ్ చేయగా భద్రాచలం మార్కెట్ కార్యదర్శిపై కూడా వేటు పడింది. సీసీఐ పత్తి కొనుగోళ్లకు సంబంధించి టీఆర్(టెంపరరీ రిజిస్ట్రేషన్)ల జారీలో భారీగా అక్రమాలు జరిగాయని ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చాలని విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే అక్రమాలకు పాల్పడిన అధికారుల్లో వణుకు మొదలైంది. జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్లు ఉండగా నాలుగు మార్కెట్ల ఆధ్వర్యంలో సీసీఐ పత్తి కొనుగోళ్లు జరిగాయి. ఆయా మార్కెట్లలోనూ టీఆర్ల జారీలో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. బూర్గంపాడు, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు మార్కెట్ల అధికారులకు విజిలెన్స్ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
పాస్బుక్లు లేని రైతుల కోసం..
జిల్లాలో నాలుగు సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేశారు. ఆయా కేంద్రాలకు పత్తిని తీసుకొచ్చే రైతులు.. తాము ఏ సర్వే నంబర్ భూమి లో ఎంత విస్తీర్ణంలో పత్తి సాగు చేశామనే వివరాలపై వ్యవసాయ శాఖ అధికారులతో ముందుగానే క్రాప్ బుకింగ్ చేసుకోవాలి. వారు ఇచ్చిన బుకింగ్ ఆన్లైన్ లిస్ట్ ఆధారంగా మార్కెటింగ్ శాఖ అధికారులు ధ్రువీకరిస్తేనే సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేస్తారు. అయితే పట్టాదారు పాసు పుస్తకాలు లేని రైతులు, పోడు సాగు చేసుకుంటున్న వారు పత్తి అమ్ముకునేందుకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీంతో అలాంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ ప్రక్రియ ప్రారంభించింది. పట్టాదారు పాసు పుస్తకాలు లేని రైతులు తమ భూమి వివరాలను ముందుగా వ్యవసాయ అధికారులకు తెలియజేసి పత్తి వేసినట్లు నమోదు చేసుకోవాలి. అయితే చిన్న, సన్నకారు రైతులకు ఈ ప్రక్రియపై అవగాహన లేకపోవడంతో టీఆర్కు దూరంగా ఉండగా.. వ్యాపారులు, దళారులు మాత్రం దీన్ని తమ కు అనుకూలంగా మార్చుకున్నారు. కొందరు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులను ప్రసన్నం చేసుకుని తమ బంధువుల పేర్లతో టీఆర్లు పొందారు. వాటి ఆధారంగా గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతుల నుంచి పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేసి సీసీఐలో ఎక్కువ ధరకు అమ్ముకున్నారు.
సీసీఐ కేంద్రాల్లో భారీగా అక్రమాలు ?
టీఆర్ల జారీలో అవకతవకలపై
చర్యలకు రంగం సిద్ధం
ఇప్పటికే మార్కెట్ కార్యదర్శులకు
నోటీసులు
క్షేత్రస్థాయి విచారణ చేపట్టిన
విజిలెన్స్ అధికారులు
రైతులను ఆరా తీసిన అధికారులు
ఇల్లెందురూరల్/అశ్వాపురం : సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి అమ్మకాలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. అశ్వాపురం మండలం రామచంద్రాపురం, ఇల్లెందు మండలం కొమరారం గ్రామాల్లో మంగళవారం పర్యటించిన అధికారులు.. ఎంత విస్తీర్ణంలో పత్తి సాగు చేశారు.. సీసీఐ కేంద్రంలో ఎన్ని క్వింటాళ్లు అమ్మారు.. డబ్బులు ఎవరి ఖాతాల్లో జమయ్యాయి అంటూ రైతుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు. కొమరారంలో 148 టీఆర్ కూపన్ల ద్వారా పత్తి విక్రయించగా అన్నింటిపైనా ఆరా తీసి, వివరాలు నమోదు చేశారు.

విజిలెన్స్ !