
కొండరెడ్ల అభివృద్ధే లక్ష్యం
దమ్మపేట : కొండరెడ్ల జీవన స్థితిగతులను అధ్యయనం చేసి, వారి సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. మండల పరిధిలోని పూసుకుంట, కటుకూరు అటవీ మార్గంలో సుమారు రూ.5 కోట్లతో నిర్మించిన మూడు హై లెవల్ వంతెనలను స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి మంత్రి తుమ్మల మంగళవారం ప్రారంభించారు. అనంతరం పూసుకుంటలో నిర్వహించిన సమావేశంలో కొండరెడ్లు ఉమ్మాల నారాయణమ్మ, యాట్ల కాంతారెడ్డికి భద్రాచలం ఐటీడీఏ ద్వారా మంజూరైన టెంట్హౌస్, సౌండ్ సిస్టంలను, మరో ఐదుగురికి తేనెటీగల పెంపకం సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొండరెడ్ల వ్యవసాయ క్షేత్రాల్లో చెట్లు నరకకుండా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని ఆ శాఖ ఎస్ఈ మహేందర్కు సూచించారు. డ్రైవింగ్లో నైపుణ్యం గల కొండరెడ్ల యువతను గుర్తించి, లైసెన్స్లు ఇప్పించాలని, ప్రజా రవాణా కోసం రెండు వాహనాలు అందజేయాలని ఐటీడీఏ పీఓ రాహుల్ను ఆదేశించారు. పోడు భూముల్లో పచ్చదనం పెంచేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్కు సూచించారు. జిల్లా స్థాయి అధికారులు నెలలో ఒక్కసారైనా పూసుకుంట, కటుకూరు గ్రామాలను సందర్శించి, స్థానికుల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. ఆయా గ్రామాల రైతులు పామాయిల్, మునగ పంటలు సాగు చేసేలా ఉద్యాన అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. కొండరెడ్లకు పౌష్టికాహారం అందించాలని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలపై స్థానిక ఎమ్మెల్యేకు ముందుగా సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నాటికి దమ్మపేట, అశ్వారావుపేట మండలాలకు గోదావరి జలాలు తీసుకొస్తామని అన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కొండరెడ్ల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. పాత రెడ్డిగూడెం, గోగులపూడి గ్రామాల్లో అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, పూసుకుంట అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరుచేశామని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్, ట్రైనీ కలెక్టర్ శర్మ, డీపీఓ చంద్రమౌళి, ఆర్డీఓ మధు, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్ఓ జయలక్ష్మి, సీడీపీఓ హేమసత్య తదితరులు పాల్గొన్నారు.
వచ్చే ఏడాది నాటికి గోదావరి జలాలు తీసుకొస్తాం
శంకుస్థాపన, ప్రారంభోత్సవాలపై స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలి
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం