
ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించాలి
చుంచుపల్లి: అధికారులు, సిబ్బంది సమష్టిగా పని చేస్తూ కొత్తగూడెం ఆర్టీసీ డిపోను అభివృద్ధి పథంలో నడిపించాలని ఖమ్మం రీజినల్ మేనేజర్ ఎ.సరిరామ్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం డిపోలోని పలు సెక్షన్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు అందించాల్సిన సేవలపై సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఉద్యోగులంతా సమష్టిగా పని చేస్తూ సంస్థను లాభాల బాట పట్టించాలన్నారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సులు నడపాలని సూచించారు. బస్టాండ్ ప్రాంగణంలో ఆర్టీసీ ప్రయాణికులకు సౌకర్యాల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ చూపిన పలువురు ఉద్యోగులను సత్కరించారు. ఆర్ఎం వెంట డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, సూపర్వైజర్లు, ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు.
ఆర్ఎం సరిరామ్