
నృత్యం.. కళారూపం
● వివిధ నృత్యరూపకాల్లో ఖమ్మం వాసుల ప్రతిభ ● పోటీల్లో రాణించడమే కాక ఇంకొందరికి శిక్షణ ● నేడు అంతర్జాతీయ నృత్య దినోత్సవం
ఖమ్మంగాంధీచౌక్: కళారూపాల్లో ఒకటైన నృత్యం.. సాంస్కృతిక వ్యక్తీకరణకే కాక విద్యాసాధనంగానూ ఉయోగపడుతోంది. అన్ని కళలతో నాట్యం ముడిపడి ఉండడంతో సమాహార కళగా పిలుస్తారు. ఈ కళా శాస్త్రాన్ని భరతముని అందించినట్లు చెబుతుండగా... సంగీతం మాదిరిగానే నృత్యం కూడా విశ్వవ్యాప్తమైంది. ఫ్రెంచ్కు చెందిన ప్రముఖ నృత్యకారుడు జీన్ జార్జెస్ నోవెర్రే జయంతి సందర్భంగా ఏటా ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్యదినోత్సవంగా జరుపుకుంటున్నారు. అయితే, పలు దేశాల్లో నృత్యానికి చట్టపరమైన సూచనలు లేకపోగా, ప్రభుత్వాలు బడ్జెట్లో కేటాయింపులూ చేయడం లేదు. దీంతో ప్రభుత్వ సంస్థల్లో నృత్య విద్యకు ప్రోత్సాహం కొరవడింది.
నాగరికత
ఆధారంగా నృత్యకళ
నాగరికతల ఆధారంగా నృత్యకళ రూపుదిద్దుకోగా.. కాలానుగుణంగా అనేకమార్పులు చోటుచేసుకున్నాయి. దాదాపు రెండు వేల ఏళ్ల కిందటే నాట్య శాస్త్రం రూపుదిద్దుకుంది. మన దేశంలో వివిధ రకాల శాసీ్త్రయ నృత్యరీతులు అందుబాటులో ఉన్నాయి. ప్రాంతాల వారీగా భరతనాట్యం, కథక్, కూచిపూడి, ఒడిస్సీ, కథాకళి, మణిపురి, మోహినీయాట్టం వంటివి గుర్తింపు పొందాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన కూచిపూడి, పేరిణి దేశవ్యాప్తంగానూ గుర్తింపు సాధించాయి. పేరిణి నృత్యం కాకతీయుల కాలంలో ప్రాచుర్యం పొందగా.. దీనికి తెలంగాణ నృత్యమని, యోధుల నృత్యమని పిలుస్తారు. యోధులు యుద్ధానికి వెళ్లే ముందు శివుడిని ఆరాధిస్తూ ఈ నృత్యం చేసే వారని ప్రతీతి.
కళల గుమ్మం.. ఖమ్మం
కళల గుమ్మంగా ఖమ్మంకు పేరు. ఈక్రమంలోనే వివిధ కళలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉండగా.. నాట్య కళకు మాత్రం ఆ పరిస్థితి కానరాదు. నాట్యం విద్యకు ముడిపడి ఉన్నప్పటికీ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ ప్రాధాన్యత దక్కడం లేదు. అక్కడక్కడా పైవేట్ సంస్థలు మాత్రం ఆసక్తి ఉన్న వారికి శిక్షణ ఇస్తున్నాయి. దీంతో పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు.
నృత్య పండిత ‘మోహను’డు
కూచిపూడి నృత్యంలో ఖమ్మంకు చెందిన కే.జే.మోహన్రావు పేరుగడించారు. పదేళ్ల వయసులోనే కూచిపూడిలో ప్రావీణ్యం సాధించిన 53 ఏళ్లుగా ఎందరికో శిక్షన ఇచ్చారు. 1981 నుంచి తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చినాయన ఇతర రాష్ట్రాల్లోనూ తన కళ ద్వారా గుర్తింపు పొందారు. ఖమ్మం బాలభవన్లో అనాథ పిల్లలకు నేర్పించిన ఆయన హైదరాబాద్ లలితకళా తోరణంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో 60 మంది అనాథ పిల్లలతో నృత్య ప్రదర్శన ఇప్పించారు. 1978లోనే నృత కళాభారతి సంస్థను ఏర్పాటుచేసి శిక్షణ ఇస్తున్నారు.
పేరిణి.. వీరూనాయక్
తెలంగాణ నృత్య కళారూపంగా భావించే పేరిణి నృత్యాన్ని జిల్లాలో వీరూనాయక్ తెరపైకి తీసుకొచ్చాడు. కూసుమంచిమండలానికి చెందిన ఆయన పదిహేనేళ్ల కిత్రం పేరిణి నృత్యం నేర్చుకొని ఖమ్మంలో నృత్యాలయం ద్వారా పేరిణి శివతాండవంపై శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 500 మందికి శిక్షణ ఇవ్వగా.. అందులో పలువురు ప్రదర్శనల ద్వారా గుర్తింపు సాధించారు. ఇక వీరూనాయక్ స్వర్ణకంకణ, సర్వ కళా ప్రతిభ, నంది అవార్డులతో పాటు కళారాధన, స్వర్ణనంది అవార్డులు పొందారు.
నాట్యమయూరి ‘మీనా’
ఖమ్మం నగరానికి చెందిన మీనాకు నాట్యంలో మంచి గుర్తింపు ఉంది. ఐదేళ్ల వయసు నుంచే అభ్యాసన ప్రారంభించిన ఆమె కూచిపూడిలో డిప్లొమా పూర్తి చేసి 12 ఏళ్లుగా వందలాది మంది చిన్నారులకు శిక్షణను ఇస్తున్నారు. ఆమె స్వతహాగా దేశంలోని పలు ప్రాంతాల్లోనూ కాక మలేషియా, సింగపూర్ తదితర దేశాల్లో ప్రదర్శనలు ఇవ్వడం విశేషం. మీనా నృత్య ప్రదర్శనలకునాట్యమయూరి, నాట్యకౌముది, తెలుగు తేజం, నాట్య గురురత్న, నాట్య శిరోమణి తదితర అవార్డులు గెలుచుకుంది.

నృత్యం.. కళారూపం

నృత్యం.. కళారూపం