
హెచ్డబ్ల్యూఓ అభ్యర్థులకు త్వరలోనే కౌన్సెలింగ్
భద్రాచలంటౌన్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా హాస్టల్ వెల్ఫేర్ అధికారుల(హెచ్డబ్ల్యూఓ) పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు త్వరలో కౌన్సెలింగ్ నిర్వహించి, పోస్టింగ్లు ఇస్తామని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ తెలిపారు. ఐటీడీఏలో సోమవారం అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను పీఓ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాచలం జోన్కు 27 మంది అభ్యర్థులను పంపారని చెప్పారు. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ కమిటీ సభ్యుల సమక్షంలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసినట్లు పేర్కొన్నారు. పాఠశాలలు తెరిచే లోపల పోస్టింగ్లు ఇస్తామని తెలిపారు. అధికారులు మణెమ్మ, అనసూయ, ఇందిర, రమణయ్య, అశోక్ కుమార్, చంద్రమోహన్, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.
నవ కంపెనీలో
కాంట్రాక్టర్ మృతి
పాల్వంచ: పట్టణంలోని నవ కంపెనీలో నీళ్లలో పడి ఓ కాంట్రాక్టర్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. టీచర్స్ కాలనీకి చెందిన ఉప్పల గిరీశం వెంకటేశ్వరరావు (60) నవ కంపెనీలో సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. సోమవారం పనుల పరిశీలనకు వెళ్లిన వెంకటేశ్వరరావు కూలింగ్ టవర్ వద్ద కాలు జారి పడిపోయాడు. దీంతో కొద్ది సేపటి తర్వాత గుర్తించిన ఉద్యోగులు అధికారులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి ముగ్గురు పిల్లలు కాగా, వారు విదేశాల్లో ఉన్నారు. మృతుడి భార్య పుష్పలత ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుమన్ కేసు నమోదు చేశారు.
‘ఎల్లో టీ షర్ట్’లపై నిరసన
బూర్గంపాడు: ఐటీసీ పీఎస్పీడీలో పర్మనెంట్ కార్మికులకు ఎల్లో కలర్ టీ షర్ట్లు ఇవ్వడంపై కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. సోమవారం కార్మిక సంఘాల నాయకులు ఐటీసీ అడ్మిన్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గుర్తింపు కార్మిక సంఘం టీఎన్టీయూసీ నిర్ణయాలకు అనుగుణంగా, కార్మిక సంఘాలతో చర్చించకుండా.. ఐటీసీ యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్మికులందరూ ఎల్లో టీ షర్ట్లు తీసుకోకుండా నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళళనలో కార్మిక సంఘాల నాయకులు గోనె రామారావు, సానికొమ్ము శంకర్రెడ్డి, మల్లికంటి వెంకటేశ్వర్లు, బిజ్జం అశోక్రెడ్డి, సింగంనేని ప్రసాద్, వెంకటేశ్వర్లు, వెంకటరమణ, అబ్దుల్ సలీమ్, సాబీర్ పాల్గొన్నారు.
ముగిసిన అంతర్ జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు
ఏన్కూరు: మండలంలోని గంగుల నాచారంలో మూడు రోజులు జరుగుతున్న ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఈ పోటీలలో 25 జట్లు పాల్గొనగా, ఏన్కూరు మండలం గంగులనాచారం జట్టు విజేతగా నిలిచింది. ఆతర్వాత స్థానాల్లో సూరారం, గోలిమిల్లు, గంగులనాచారం(బీ), పుఠానీ తండా, చెరువుమాదారం జట్లు నిలిచాయి. విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముక్తి వెంకటేశ్వర్లు, మల్కం గంగులు, పూసం సుధీర్, మల్లేష్, భద్రయ్య, భీమరాజు, గోపాలరావు, వినోద్కుమార్, సీతారాములు, వెంకటేశ్వర్లు, శివకృష్ణ, నాగార్జున, సాగర్, దినేష్, నరేష్ పాల్గొన్నారు.
మెరుగైన వైద్యం
అందించండి
తిరుమలాయపాలెం: ప్రకృతి వైద్యం ప్రత్యేకతలను ప్రజలకు వివరిస్తూ మెరుగైన వైద్యం అందించాలని రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ప్రమీలాదేవి సూచించారు. తిరుమలాయపాలెంలోని ప్రకృతి వైద్యశాలను సోమవారం ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఓపీ సేవలు, రికార్డులను పరిశీలించాక ఉద్యోగులకు సూచనలు చేశారు.
ప్రభుత్వాస్పత్రిలో బాలిక అదృశ్యం.. ఆచూకీ లభ్యం
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలోని ఏరియా ఆస్పత్రిలో ఏడేళ్ల బాలిక సోమవారం రాత్రి అదృశ్యమైంది. మణుగూరుకు చెందిన ఓ మహిళ భద్రాచలం ఆస్పత్రిలో పది రోజులుగా చికిత్స పొందుతోంది. ఆమె ఏడేళ్ల కుమార్తె కూడా ఆస్పత్రిలో ఆమెతోపాటే ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం వరకు ఆస్పత్రిలోనే ఉన్న ఆ బాలిక బ్లెస్సీ అదృశ్యం కావడంతో తల్లితోపాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీనిపై సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ చేపట్టగా.. ఎట్టకేలకు రాత్రి పొద్దుపోయాక ఆచూకీ లభ్యమైంది. ప్రస్తుతం బాలిక పోలీసుల ఆధీనంలో ఉన్నట్లు తెలిసింది.