
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
టేకులపల్లి: కుటుంబంలో తలెత్తిన గొడవలు, వేధింపుల నేపథ్యంలో కూల్డ్రింక్లో పురుగుల మందు కలుపుకుని తాగిన ఘటనలో భార్య చనిపోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భర్త కూడా సోమవారం మృతి చెందాడు. టేకులపల్లి ఎస్ఐ రాజేందర్ కథనం ప్రకారం.. మండలంలోని బేతంపూడి పంచాయతీ వెంకటియా తండాకు చెందిన బోడ శ్రీను(26) ఆరు నెలల క్రితం రేగులతండాకు చెందిన దీపిక(19)ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా శ్రీను తన సోదరి వివాహానికి ఆర్థికసాయం కావాలని మామ వత్మల్, తోడల్లుళ్లు భర్మవత్ రవి, నాగేశ్వరరావులను అడిగాడు. వారు ఆర్థికసాయం చేయకపోగా దూషించారు. దీంతో మనస్తాపం చెంది ఈ నెల 24న శ్రీను, దీపికలు పురుగుల మందు తాగారు. కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఈ నెల 25న దీపిక మృతి చెందింది. పరిస్థితి విషమించి సోమవారం శ్రీను కూడా మృతి చెందాడు. మృతుడి తండ్రి వీరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ తెలిపారు.
కొడుకు దాడిలో గాయపడిన తండ్రి..
గుండాల: మద్యానికి బానిసైన కుమారుడు దాడి చేయగా గాయపడిన తండ్రి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గుండాల సీఐ రవీందర్ కథనం ప్రకారం.. మండలంలోని తూరుబాక గ్రామానికి చెందిన ఈసం పోతయ్య (52) కుమారుడు స్వామి నిత్యం మద్యం తాగుతూ ఇంట్లో గొడవ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 21న తండ్రి, కొడుకుల మధ్య గొడవ జరిగింది. దీంతో కుమారుడు కర్రతో దాడి చేయగా, తండ్రి తలకు బలమైన గాయమైంది. అతన్ని ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
పాల్వంచ: ఏడుగురు పేకాట రాయుళ్లను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలోని ఎస్సీ కాలనీ శ్మశాన వాటిక వద్ద పేకాట ఆడుతుండగా ఎస్ఐ సుమన్ ఆధ్వర్యంలో సిబ్బంది దాడి చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, మోటార్ సైకిల్, నాలుగు సెల్ఫోన్లు, రూ.3,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.