కోడలు ఇంటి ఎదుట వృద్ధురాలి నిరసన | - | Sakshi
Sakshi News home page

కోడలు ఇంటి ఎదుట వృద్ధురాలి నిరసన

Apr 29 2025 7:04 AM | Updated on Apr 29 2025 7:04 AM

కోడలు ఇంటి ఎదుట వృద్ధురాలి నిరసన

కోడలు ఇంటి ఎదుట వృద్ధురాలి నిరసన

అశ్వారావుపేటరూరల్‌: కోడలు ఇంటి ముందు ఓ వృద్ధురాలైన అత్త బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ఘటన సోమవారం జరిగింది. స్థానికులు, బాధితురాలి కథనం ప్రకారం.. మండల పరిధిలోని నారంవారిగూడెం కాలనీ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు మానుగొండ రాజాలు, సీతమ్మలకు ఏడెకరాల వ్యవసాయం భూమి ఉంది. కొన్నేళ్ల క్రితం తన కుమారుడు పుల్లారావుకు ఐదెకరాలు ఇచ్చారు. మిగిలిన రెండెకరాలు వృద్ధ దంపతులు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పదేళ్ల క్రితం కుమారుడు పుల్లారావు, రాజాలు మృతి చెందారు. ఆ తర్వాత సీతమ్మ తన కోడలుకు మరో ఎకరం కూడా ఇచ్చింది. కాగా ఆమెకు తెలియకుండా కోడలు రెండు ఎకరాలు కూడా పట్టా చేయించుకుంది. అనంతరం సక్రమంగా చూడకపోవడంతో అదే గ్రామంలో ఉన్న కుమార్తె తిరుపతమ్మ వద్ద ఉంటోంది. కుమార్తె ఆర్థిక పరిస్థితి కూడా సరిగ్గా లేకపోవడంతో జీవనం ఇబ్బందిగా మారినట్లు వృద్ధురాలు అవేదన వ్యక్తం చేస్తోంది. తన పొలం తనకు అప్పగించాలని కోరుతూ పోలీస్‌లను ఆశ్రయించగా, న్యాయం జరగకపోవడంతో కోడలి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. కోడలు ఇంటి ముందు మూడు గంటలకుపైగా బైఠాయించగా పట్టించుకోకపోవడంతో కుమార్తె వచ్చి వృద్ధురాలిని తిరిగి తన ఇంటికి తీసుకెళ్లింది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వృద్ధురాలు వేడుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement