
పెట్రోలింగ్, గస్తీ పెంచాలి
● ఇల్లెందు పోలీసుల పనితీరు అభినందనీయం ● ఎస్పీ రోహిత్రాజు
ఇల్లెందు: వేసవి కాలం దృష్ట్యా చోరీ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ పెంచాలని, బ్లూకోల్ట్స్ సిబ్బంది గస్తీ పెంచాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. శుక్రవారం ఆయన ఇల్లెందు పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. రికార్డులను, స్టేషన్ పరిసరాలను, కంప్యూటర్ గదిని, లాకప్లను పరిశీలించారు. నిఽఘా వ్యవస్థ పనితీరుపై ఆరా తీశారు. ఇటీవల ఓ చోరీ సంఘటనను ఛేదించి 29 తులాల బంగారం రికవరీ, ఓ పోక్సో కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసినందుకు పోలీసులను అభినందించారు. ఇల్లెందు పోలీస్ యంత్రాంగం పని తీరు జిల్లాలోనే టాప్ లెవల్లో ఉందని ప్రశంసించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కష్టాల్లో ఉండి పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితులకు తక్షణ న్యాయం అందాలని సూచించారు. రౌడీ షీటర్ల కదలికలపై నిఘా తీవ్రతరం చేయాలని, పెండింగ్ కేసులపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తం చేయాలని, విస్త్రృతంగా సభలు సమావేశాలు పెట్టి చైతన్యపర్చాలని సలహా ఇచ్చారు. బెట్టింగ్, గంజాయి సరఫరా మీద ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని చెప్పారు. డీఎస్పీ చంద్రభాను, సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్ఐలు పి. శ్రీనివాసరెడ్డి, బి. సూర్య, సిబ్బంది ఉన్నారు.