కొత్తగూడెంఅర్బన్: క్షయ వ్యాధిగ్రస్తులు న్యూట్రిషియన్ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ డి.వేణుగోపాల్ సూచించారు. సోమవారం లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన న్యూట్రిషియన్ కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు. జిల్లాలో 1,050 మందికి కిట్లను అందజేస్తున్నట్లు తెలిపారు. బాధితులకు ప్రభుత్వమే ఉచితంగా ఆరు నెలలపాటు పూర్తిగా ఉచితంగా మందులు అందిస్తుందని పేర్కొన్నారు. వైద్యాధికారులు బి.బాలాజీ, హరీష్, పాయం శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.
వేసవిలో జాగ్రత్తలు తీసుకోవాలి
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : వేసవిలో చిన్నపిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి జేఎంఎస్ లెనీనా అన్నారు. మండలంలోని ఎర్రగుంట సెక్టార్ శాంతినగర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం ఆమె సందర్శించి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో మొక్కలు నాటి పెంచాలని సూచించారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ సలోని, సూపర్వైజర్ రాణి పాల్గొన్నారు.
మహిళపై దాడి
ఇల్లెందు: మండలంలోని ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన బానోత్ మంగమ్మ సోమవారం చేను వద్ద పనిచేస్తుండగా అదే గ్రామానికి చెందిన సంపత్ అత్యాచారానికి యత్నించాడు. తప్పించుకుని వెళ్తుండగా రాయితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.
ఇసుక ట్రాక్టర్లు సీజ్
దుమ్ముగూడెం : అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ అశోక్ కథనం ప్రకారం.. రేగుబల్లి గ్రామ శివారులో గోదావరి నది నుంచి ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని స్టేషన్కు తరలించారు. ఈ ఘటనలో పాత మారేడుబాక గ్రామానికి చెందిన గుండి చిట్టిబాబు, కుర్శం కనకరాజు, తూరుబాక గ్రామానికి చెందిన గుమ్మడి శ్రీనులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
పరస్పరం దాడి :
కేసు నమోదు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం న్యూగొల్లగూడెంలోని ఇద్దరు అన్నదమ్ములు పరస్పరం దాడి చేసుకోగా త్రీటౌన్ పోలీసు స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. న్యూగొల్లగూడేనికి చెందిన సోదరులు గుమ్మడేల్లి రమణ, దుర్గా మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం అనుచరులతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పరస్పరం ఫిర్యాదు చేసుకోగా పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు.
కాపర్ వైరు చోరీ చేస్తున్న వ్యక్తి పోలీసులకు అప్పగింత
అశ్వాపురం: వ్యవసాయ మోటార్లలో కాపర్ వైరు చోరీ చేస్తున్న వ్యక్తిని రైతులు సోమవారం పట్టుకున్నారు. మండల పరిధిలోని జగ్గారం గ్రామంలో రైతులు పర్శబోయిన సుధాకర్, రాసబంటి లింగరాజు, నాగరాజు, ఆవుల ఎల్లయ్య, మదమంచి నరసింహారావుకు చెందిన మోటార్ల కాపర్ వైరు చేసిన పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన మొద్దుల నరేష్ను రైతులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇతనిపై గతంంలో పాల్వంచ మండలంలో కేసు కూడా నమోదైనట్లు సమాచారం.
మనస్తాపంతో
లారీడ్రైవర్ బలవన్మరణం
కొణిజర్ల: ఓ వైపు అప్పుల బాధ, మరోవైపు పెళ్లయిన కొద్దిరోజులకే కూతురి భర్త మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక మద్యానికి బానిసైన ఓ లారీ డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని తనికెళ్ల గంగెడ్లపాడుకు చెందిన లారీ డ్రైవర్కు తాళ్ల ఆనందరావు(51)కు భార్య శౌరమ్మతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు వివాహం చేయగా ఈ ఏడాది జనవరిలో అల్లుడు మృతి చెందాడు. అప్పటి నుంచి మనస్తాపంతో మద్యానికి బానిసైన ఆనందరావు సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరివేసుకుని మృతి చెందాడు. ఘటనపై భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జి.సూరజ్ తెలిపారు.
న్యూట్రిషియన్ కిట్లను సద్వినియోగం చేసుకోవాలి