● వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి ● రైతులకు కలెక్టర్ పాటిల్ సూచన
ఇల్లెందురూరల్ : సంప్రదాయ పద్ధతిలో కాకుండా అధిక లాభాలు వచ్చే పంటలు సాగు చేయాలని, తద్వారా అధిక ఆదాయం పొందాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైతులకు సూచించారు. మండలంలోని పూబెల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ను పలువురు రైతులు కలిసి.. ‘సార్ మా చేలకు విద్యుత్ సౌకర్యం కల్పించండి.. బోర్లు వేసుకునేందుకు అనుమతి ఇప్పించండి.. మోటార్లు మంజూరు చేయించండి..’ అంటూ విన్నవించారు. దీంతో స్పందించిన కలెక్టర్ ‘ఇవన్నీ చేసినా మీరంతా మొక్కజొన్న సాగు చేస్తూ విత్తనాలు, యూరియా అంటూ మా వెంట పడతారు.. ఇంకా మూస పద్ధతిలోనే సాగు చేస్తే ఎలా.. లాభదాయక సాగుపై దృష్టి పెట్టండి’ అని అన్నారు. లాభదాయక సాగు వనరులపై విస్తృతంగా ప్రచారం చేయడమే కాక సబ్సిడీలు ప్రకటిస్తున్నా పలువురు రైతులు మొక్కజొన్న సాగుకే ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. వేసవిలో మునగసాగు చేయాలని చెప్పడమే కాక సాగుకు అనేక రాయితీలు ప్రకటిస్తున్నా ఎవరూ ముందుకు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయిల్పామ్ సాగుకు ఈ ప్రాంత భూములు అనువుగా ఉన్నాయని, అందులో అంతరపంటగా మునగ సాగు చేస్తే నాటిన ఏడాది నుంచి మూడేళ్ల పాటు ఆదాయం వస్తుందని, ఆ తరువాత ఆయిల్పామ్ ద్వారా కూడా ఆదాయం పొందవచ్చని సూచించారు. మార్కెట్లో అధిక ధర పలుకుతున్న కూరగాయల సాగుకు రైతులు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ధన్సింగ్, ఎంపీఓ చిరంజీవి, ఏపీఎం దుర్గారావు, కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.